పవన్ కల్యాణ్ను నమ్ముకున్నందుకు జైలు పాలు?
పవన్ కల్యాణ్ను నమ్ముకుని ఆక్వా ఫుడ్ పార్కు ఉద్యమాన్ని విస్తరించడానికి పూనుకున్న యువకుడు జైలు ఊచలు లెక్కిస్తున్నట్లు సమాచారం.
కాకినాడ: అవినీతికి, అన్యాయానికి, ఇతర దుర్మార్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో తుపాకికి ఎదురొడ్డి నిలబడుతానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. పోరాటాలు చేసే యువతకు తాను అండగా నిలుస్తానని, జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూ వస్తున్నారు.
అయితే, అటువంటి సందర్భం వచ్చేసరికి ఆయన తెర వెనక్కి వెళ్లిపోయారనే విమర్శలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తుండూరులో తలపెట్టిన ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా కొన్నాళ్ల క్రితం పవన్ కల్యాణ్ గళమెత్తారు. అత్యంత ప్రమాదకరమైన ఆ పార్కును తాను అడ్డుకుంటానని చెప్పారు.
ఆయన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు. పవన్ కల్యాణ్ తన వెనక ఉన్నారనే ధీమాతో విశ్వ మానవ వేదికను ప్రారంభించి ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా మల్లుల సురేష్ పోరాటం చేస్తూ వచ్చారు. ఉద్యమాన్ని విస్తరించడానికి నడుం బిగించాడు.
దాంతో ఆయన స్థానిక నేతల నుంచి, వారి అనుచరుల నుంచి భౌతిక దాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. అతనిపై కేసులు బనాయించి, అతన్ని జైలు పాలు కూడా చేశారు. అయినా సరే, పవన్ కల్యాణ్ నుంచి ఏ విధమైన ప్రతిస్పందన కూడా రాలేదని అంటున్నారు. విశాఖ ఆర్కె బీచ్లో పోలీసులు జనవరి 26వ తేదీన అరెస్టు చేసి, వారిపై కేసులు పెట్టిన సంఘటనలపై కూడా ఈ విధమైన మౌనాన్నే పవన్ కల్యాణ్ పాటించారనే విమర్శలు వస్తున్నాయి.