ఒకే టేబుల్పై డిన్నర్: బాబుతో మోడీ ఏకాంతంగా చర్చలు!
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏకంగా 33 పార్టీల అగ్రనేతలు పాల్గొన్న సమావేశంలో సీఎం చంద్రబాబుకు కీలక ప్రాధాన్యం లభించడం చర్చనీయాంశమైంది.
సమావేశంలో ప్రధాని మోడీకి ఒకవైపు అమితషా కూర్చోగా... మరోవైపు చంద్రబాబు కూర్చోవడం గమనార్హం. ఈ భేటీలో ఎన్డీయే సాధించిన విజయాలు, మూడేళ్ల వార్షికోత్సవాల నిర్వహణపై చర్చించారు. భేటీ సందర్భంగా పలుమార్లు చంద్రబాబుతో మోడీ మంతనాలు జరిపారు.
చంద్రబాబుకు ప్రాధాన్యత
ఈ మావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను తెలిపేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ, చంద్రబాబు మాత్రమే పాల్గొనడం మరో విశేషం. మూడేళ్లలో సాధించిన విజయాలపై మోదీ ప్రజంటేషన్ తర్వాత ఇచ్చిన విందులో మోడీ, అమితషా, రాజ్నాథ్, చంద్రబాబు ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు.
ఏకాంతంగా చర్చలు..
ఈ సమయంలో చంద్రబాబును మోడీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు ఏకాంతంగా చర్చించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులపై చంద్రబాబు అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నట్లు తెలిసింది. చివరలో మోడీ... చంద్రబాబుతోపాటు కొద్దిదూరం నడిచి వచ్చి ఆయనకు వీడ్కోలు పలకడం విశేషం.
మోడీ మాటే మా మాట
‘మోడీ మాటే మా మాట.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయిస్తారో తెలియదుగానీ.. ఆయన ఎవరి పేరు చెప్తేవారికే మా మద్దతు ఉంటుంది. ‘మాలో భిన్నాభిప్రాయాలు లేవు' అని చెప్పడానికే ఈ భేటీ. మాదంతా ఒకే మాట' ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఓ సీనియర్ నేత తేల్చిచెప్పారు.
సాధించిన విజయాలపై ప్రజెంటేషన్..
ప్రవాసీ భారతీయ భవన్లో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో.. 32 పార్టీలకు చెందిన ప్రతినిధులు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొన్నారు. ఎన్డీయే సర్కారు గత మూడేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై ప్రధాని మోడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
చంద్రబాబును కలుసుకున్న అమిత్ షా
సమావేశానికి ముందు అమితషా.. ఏపీ సీఎం చంద్రబాబు సహా కొన్ని ముఖ్యమైన పార్టీల నేతలను కలుసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై వారి మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నాన్ని అమితషా చేసినట్లు సమాచారం. ఎన్డీయేలో ప్రధాన పక్షమైన బీజేపీ ముందుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆ తరువాత తమ అభిప్రాయాలను తెలియజేస్తామని.. సమీకరణాలన్నింటినీ ఆలోచించే మోడీ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తమకు పెద్దగా అభ్యంతరాలు ఉండవని ఆ నేతలు అమితషాకు చెప్పినట్లు తెలిసింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపికలో..
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక విషయంలో తమలో ఎటువంటి చీలికలూ వచ్చే అవకాశం లేదన్న సంకేతాలను ప్రతిపక్షాలకు పంపేందుకే ప్రధాని ఈ భేటీ నిర్వహించినట్లు బీజేపీ సీనియర్ నేతలు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన గతంలో.. కాంగ్రెస్ ఎంపిక చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు రెండుసార్లు ఓటేసిన విషయం తెలిసిందే. ఈసారి అటువంటి అవకాశాలకు తావివ్వకుండా అందర్నీ ఏకతాటిపైకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతి ఒక్క ఓటూ కీలకంగానే మారనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. అందుకే గోవా సీఎం మనోహర్ పారికర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూడీ డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ్ప్రసాద్ మౌర్యలను ఎంపీ పదవులకు రాజీనామా చేయవద్దనే ప్రధాని మోడీ సూచించారు.
చల్లబడిన ఉద్ధవ్ హాజరు
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్పై నిషేధాన్ని ఎత్తివేయడంతో శాంతించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ భేటీకి హాజరయ్యారు. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేసిన ఉద్ధవ్ చివరికి ప్రధాని మోడీ.. ఏదీ చెబితే అదే అన్నట్లు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులపై మోడీ నిర్ణయం తీసుకునేంతవరకూ మిత్రపక్షాల నేతలు ఈ అంశంపై మాట్లాడకుండా ఉండాలని అమితషా సమావేశంలో నేతలకు సూచించినట్లు తెలిసింది.