నంద్యాల బైపోల్తో అది క్లియర్: ఎన్నిక తర్వాత పార్టీల వ్యూహాలివే?..
భవిష్యత్తు తమదే అన్న ధీమా వట్టి మాటలకే పరిమితం కాదని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా నెగ్గాల్సిందే.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో తప్పక గెలవాల్సిన అనివార్యత ఏపీలోని రెండు ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో నెగ్గితేనే భవిష్యత్తుపై ఆశలు చిగురించే అవకాశం ఉండటంతో వైసీపీకి ఇది కీలకమైన సందర్భం.
అలాగే మూడేళ్ల పాలనలోను జనంలో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడలేదని నిరూపించుకోవడానికి టీడీపీకీ ఇది కీలకమైన సందర్భమే. భవిష్యత్తు తమదే అన్న ధీమా వట్టి మాటలకే పరిమితం కాదని నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా నెగ్గాల్సిందే.
జనం తిరస్కరిస్తే టెన్షన్ తప్పదు:
ఈ ఉపఎన్నిక తర్వాత జనం తిరస్కరించే పార్టీకి వచ్చే రెండేళ్లు తీవ్రమైన కలవరం తప్పదు. అలాగే నంద్యాల ఓటరు నిర్ణయం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల మీద ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గెలిచే పార్టీకి కొంతమేర ధీమా పెరగడంతో పాటు ఓడిన పార్టీకి ఆందోళన తప్పదు.
Recommended Video
అది క్లియర్.. నేతలా? పార్టీలా?..:
ఈ ఎన్నిక ద్వారా మరో విషయం కూడా స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పార్టీలు మారిన జనం నేతలను అంటిపెట్టుకునే ఉన్నారా?.. లేక నేతల కన్నా పార్టీనే ముఖ్యమని భావిస్తున్నారా? అన్నది ఈ ఉపఎన్నిక ద్వారా తేలిపోనుంది.
భూమా బ్రహ్మానందరెడ్డి గనుక ఇక్కడ గెలిస్తే.. నంద్యాల ప్రజలంతా ఆ కుటుంబం వెనుకే ఉన్నారన్న సంకేతం వస్తుంది. అదే సమయంలో విజయం శిల్పాను గనుక వరిస్తే.. జనం వైసీపీ వెంటే ఉన్నారన్న సంకేతం వస్తుంది. కాబట్టి జనం ఎటువైపు ఉన్నారో తేల్చుకోవడానికి ఈ ఉపఎన్నిక బాగానే ఉపయోగపడనుంది.
ఫిరాయింపు నేతలకూ టెన్షన్:
ఈ ఉపఎన్నికలో నంద్యాల ఓటర్లు ఇచ్చే తీర్పు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. జనం భూమా వర్గాన్ని తిరస్కరిస్తే రాబోయే రెండేళ్లు వారు హైటెన్షన్ తో కాలం వెళ్లదీయాల్సిందే. ఇలాంటి తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను మార్చడానికి వైసీపీ కొత్త ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది.
నంద్యాల ఫలితం తర్వాత వ్యూహాలు:
ఒకవేళ నంద్యాలలో వైసీపీ గనుక గెలిస్తే.. ఈ ఎన్నిక తర్వాత ఆ పార్టీ కూడా 'ఆపరేషన్ ఆకర్ష్' అస్త్రాన్ని సంధించవచ్చు. నంద్యాల ఇచ్చిన విజయం టీడీపీ గూటి నుంచి పలువురు నేతలను పార్టీలోకి లాగడానికి వైసీపీకి ఉపయోగపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో వైసీపీ బొక్కబోర్లా పడితే గనుక ఆ పార్టీ నుంచి మరోసారి ఫిరాయింపుల పర్వం జోరందుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇందుకోసం అధికార పార్టీ కాచుకు కూర్చుంటుందన్న విషయం కొట్టిపారేయలేనిది.
అంతిమ నిర్ణయం ఓటరుదే:
మొత్తం మీద నంద్యాల ఉపఎన్నికతో ఇన్ని సమీకరణాలు ముడిపడి ఉన్నందునే అటు జనం, ఇటు రాజకీయ వర్గాలు ఈ ఎన్నికపై తీవ్ర ఆసక్తితో ఉన్నాయి. ఇక్కడ పట్టు నిలుపుకుంటేనే ఆ తర్వాత రాష్ట్రమంతా విస్తరించవచ్చనే భావనలో వైసీపీ.. భవిష్యత్తు కూడా తమదే అని నిరూపించుకోవడానికి టీడీపీకి ఇదో కీలకమైన ఎన్నిక కావడంతో.. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా ఓటరు చెప్పిందే రాజకీయాల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి.. ఫలితాలు వచ్చేవరకు గెలుపోటములపై అంచనాలే తప్ప స్పష్టమైన వివరణ కష్టం.