దొరికితే చాలు: మరోసారి తప్పులో కాలేసిన నారా లోకేష్
నారా లోకేష్ తన పొరపాట్ల ద్వారా ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా, ఓ ట్వీట్ ద్వారా ఆయన అలా దొరికిపోయారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ఏం తప్పు చేస్తాడా దొరబుచ్చుకుందామనే పద్ధతిలో ప్రత్యర్థులు కాచుకుని కూర్చున్నారు. అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నారా లోకేష్ మరోసారి తప్పులో కాలేశారు. దాన్నే ప్రత్యర్థులు దొరకపుచ్చుకుని మీడియాలో వార్తాకథనం రాశారు.
అమరావతిలో మండలి చైర్మన్ చక్రపాణిగారిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ గురువారం రాత్రి నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆ స్టేటస్కు జత చేసిన ఫొటోలో అసలు చక్రపాణి లేరు. దాన్ని సాక్షి మీడియా దొరకబుచ్చుకుని మళ్లీ పప్పులో కాలేసిన మంత్రి లోకేష్ అంటూ వ్యంగ్యకథనం రాసింది.
మిత్రులు, సన్నిహితుల ద్వారా తాను చేసిన పొరపాటును తెలుసుకున్న నారా లోకేష్ ట్వీట్ను తొలగించి సరైన ఫొటోతో మరో ట్వీట్ చేశారు. ఈసారి చక్రపాణిని కలిసిన ఫొటోను జతచేశారు. ఈ రెండు ఫొటోల స్క్రీన్ షాట్స్ను కూడా సాక్షి మీడియా ప్రచురించింది.
అంబేడ్కర్ వర్ధంతి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా, వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు మావే అని అనడం ద్వారా ప్రత్యర్థులకు గతంలో లోకేష్ దొరికిపోయారు. అలా దొరికిపోయిన లోకేష్ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా పప్పుగా అభివర్ణించింది.
దానికి నారా లోకేష్ స్పందించారు కూడా. ప్రతిపక్షాలు తనను పప్పు అని ఒకసారి, అవినీతిపరుడని మరోసారి విమర్శిస్తున్నాయని, ఆ రెండింటిలో తాను ఏదో తేల్చి చెప్పాలని అన్నారు. ఏమైనా, లోకేష్ కాస్తా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పక తప్పదు.