తెర పైకి మరో గ్రూప్: అన్నాడీఎంకెలో ముదురుతోన్న అనిశ్చితి!, పళనికి కొత్త తలనొప్పి..
వైగై సెల్వన్ ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఒక గ్రూపుగా ఏర్పడి రహస్య సమావేశాలు నిర్వహించారు.
చెన్నై: జయలలిత మరణానంతరం అన్నాడీఎంకెలో మొదలైన అనిశ్చితి రాజకీయాలకు ఇంకా తెరపడటం లేదు. మొన్నటిదాకా శశికళ-పన్నీర్, ప్రస్తుతం పళనిస్వామి-పన్నీర్ సెల్వం వర్గాల మధ్య నలుగుతున్న ఆ పార్టీ రాజకీయం.. రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. పార్టీలో ఎవరో ఒకరు అసమ్మతి సెగ రాజేయడం కామన్ గా మారిపోయింది.
తాజాగా అన్నాడీఎంకె పార్టీలో వైగై సెల్వన్ ఆధ్వర్యంలో మరో కొత్త వర్గం పుట్టుకొచ్చింది. వైగై సెల్వన్ ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఒక గ్రూపుగా ఏర్పడి రహస్య సమావేశాలు నిర్వహించారు. దీంతో సీఎం పళనిస్వామికి ఈ రహస్య సమావేశాల తలనొప్పి పట్టుకున్నట్లయింది.
అంతకుముందు కొంగు మండలం శాసనసభ్యులు, ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు వేర్వేరుగా రహస్య సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాజీ మంత్రి తోపు వెంకటాచలం నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు జరిపారని, పార్టీ నుంచి ఆ వర్గం వేరుపడటం ఖాయమని ఊహాగానాలు వినిపించాయి. తాజా వైగై సెల్వన్ తో ఈ గ్రూపు రాజకీయాలు మరింత రక్తికట్టాయి.
ఎప్పుడు ఎవరు రహస్య సమావేశాలు పెడుతారో.. ఎందుకు పెడుతున్నారో తెలియక సీఎం పళనిస్వామి తలపట్టుకున్నారు. ఓవైపు పన్నీర్ సెల్వం వర్గంతోనే వేగలేకపోతున్న తరుణంలో.. ఇలా రోజురోజుకు పార్టీలో కొత్త గ్రూపు పుట్టుకురావడం పళనిస్వామిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. చూడాలి మరి.. ఈ అనిశ్చితి రాజకీయాలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో!