అన్నంత పని చేశారు: తాగునీరు ఇవ్వలేదని మూత్రం తాగారు
తమ కష్టాలపై వివిధ రీతుల్లో ఆందోళనలు నిర్వహిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తమిళనాడు రైతులు మరోసారి కొత్త పద్ధతిలో నిరసన తెలిపారు.
న్యూఢిల్లీ: తమ కష్టాలపై వివిధ రీతుల్లో ఆందోళనలు నిర్వహిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తమిళనాడు రైతులు మరోసారి కొత్త పద్ధతిలో నిరసన తెలిపారు. తమ ఆందోళనలో భాగంగా ప్రభుత్వ దృష్టిని ఆకట్టుకునేందుకు శనివారం మూత్రాన్ని తాగారు.
40వ రోజుకు చేరిన ఆందోళన కార్యక్రమాల్లో పోలీసులు నిలువరించేందుకు యత్నించినా మూత్రం తాగారు. రుణమాఫీ, సవరించిన కరవు ప్యాకేజీ, దిగుబడులకు మెరుగైన మద్దతు ధరలు అందించాలనే డిమాండ్లతో గత 39 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా సగం గుండు గీయించుకోవడం, సగం మీసాలు తొలగించుకోవడం, సామూహిక అంత్యక్రియలు నిర్వహించడం, రుణభారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెల్ని ప్రదర్శించడం, కొరడాలతో కొట్టుకోవడం వంటి వివిధ పద్ధతుల్లో నిరసనలు తెలిపారు.
ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న పి అయ్యక్కన్ను ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రం తమకు తాగునీరు ఇవ్వడం లేదనీ, అందుకే మూత్రం తాగామన్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే మూత్రం తాగుతామని రైతులు శుక్రవారమే ప్రకటించారు. ఈ నెల 10న దుస్తులు విప్పి నిరసన తెలిపారు.
రైతులను కలిసిన ముఖ్యమంత్రి
ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం కలిశారు. రైతుల వద్ద మెమోరాండం తీసుకొని ప్రధానికి ఇస్తానని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం పళనిస్వామి ఢిల్లీ చేరుకున్నారు.