కేసీఆర్కు షాకిచ్చిన ఓయులో రాహుల్ గాంధీ కోసం...
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయు.. ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయు.. ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆగ్రహంతో ఉంది. ఇటీవల ఓయు శతాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ మాట్లాడలేని పరిస్థితి ఎదురయింది.
ఇలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీని ఓయూకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనను ఆహ్వానించి, సభ నిర్వహించాలని చూస్తున్నారు.
వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయనకు సన్మానం చేస్తారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం కోరగా.. అందుకు వారు సుముఖంగా కూడా ఉన్నారని తెలుస్తోంది.
టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థి నేతలను రాహుల్ రాకలో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అని ఆరా తీసినట్లు చెబుతున్నారు. వర్సిటీలో సభ నిర్వహిస్తే అనుమతి ఉంటుందా? అని అడిగారు. అన్ని పార్టీల వారు సమావేశాలు పెడుతున్నారని, రాహుల్ వచ్చేది శతాబ్దిఉత్సవాల కోసమని, రాష్ట్రం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి సన్మానం చేస్తే అభ్యంతరం ఏముంటుందని విద్యార్థులు చెప్పారని అంటున్నారు.
రాహుల్కు ఆహ్వానంపై బుధవారం వర్సిటీలో విద్యార్థి నేతలు చర్చించారు. రాహుల్ను ఎట్టి పరిస్థితుల్లో వర్సిటీకి రప్పించాలనీ, సభను నిర్వహించాలని నిర్ణయించారని తెలుస్తోంది. దీని కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మరోసారి భేటీ కానున్నారు. సభ నిర్వహించేందుకు టిపిసిసి కూడా సిద్ధంగా ఉంది. ఓయులో కేసీఆర్ మాట్లాడలేకపోయారని, రాహుల్ గాంధీతో మాట్లాడిస్తామని అంటున్నారు.