అంత డబ్బు పంపిస్తుంటే ఏం చేస్తున్నారు?: ఏపీకి ఆర్బీఐ ఝలక్
ఏపీలో నగదు నిల్వలు నిండుకున్నాయి. త్వరలో మరో రూ.2వేల కోట్లు పంపించనున్నారు. అయితే, ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు పంపిస్తున్నప్పటికీ నగదు నిల్వలు నిండుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆశ్చర్యపోతున్నారట.
అమరావతి: ఏపీలో నగదు నిల్వలు నిండుకున్నాయి. త్వరలో మరో రూ.2వేల కోట్లు పంపించనున్నారు. అయితే, ఏపీకి పెద్ద మొత్తంలో నిధులు పంపిస్తున్నప్పటికీ నగదు నిల్వలు నిండుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆశ్చర్యపోతున్నారట.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే నగదు ఎక్కువగా పంపారని అంటున్నారు. అయినప్పటికీ అంత డబ్బు ఏమైపోతోందని ఆర్బీఐ అధికారులు రాష్ట్ర అధికారులను ప్రశ్నించారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఏటీఎంలు నగదు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దాంతో నగదు కోసం ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్రానికి నగదు పంపాలని ఆర్బీఐ అధికారులను కోరారు. దీంతో వారు కాస్త అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఏపీకి రూ.40వేల కోట్లు
కేంద్రం పాత పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచీ మార్చి నెలాఖరు వరకు దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా నగదు ఏపీకి ఆర్బీఐ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క మార్చి నెలలోనే రాష్ట్రానికి దాదాపు రూ.9వేల కోట్ల నగదు వచ్చింది.
అసలు డబ్బు ఏమవుతోంది?
ఇదే విషయాన్ని ఆర్బీఐ అధికారులు ఏపీ అధికారులకు గుర్తు చేశారని తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తున్నప్పటికీ ఏమయిపోతోందని, నగదు ఏం చేస్తున్నారని ప్రశ్నించారని తెలుస్తోంది.
ఏ రాష్ట్రానికి పంపనంత ఏపీకి..
దేశంలోని మరే ఇతర రాష్ట్రానికి పంపనంత ఎక్కువ నగదు ఒక్క ఏపీకి మాత్రమే పంపించామని వారు వ్యాఖ్యానించారట. అధికారుల విజ్ఞప్తి మేరకు మధ్యప్రదేశ్లోని మింట్ నుంచి నగదు రాష్ట్రానికి పంపడానికి ఆర్బీఐ అధికారులు సమ్మతించారు.
ఆర్బీఐపై ఒత్తిడి
రాష్ట్ర ప్రభుత్వం నగదు అవసరాల కోసం రూ.13వేల కోట్లు పంపాలని ఆర్బీఐపై ఒత్తిడి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నగదు భాండాగారాల్లో కేవలం రూ.2,269.15 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది.
నగదు కష్టాలకు పలు కారణాలు
ఈ నగదును బ్యాంకులు ఏటీఎంల్లో పెట్టడానికి సాహసించడం లేదు. దీంతో ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు. ఈ కారణంగా నగదు కష్టాలు వచ్చాయని తెలుస్తోంది. దానికి తోడు నగదును ఎక్కువ మంది ఉపసంహరించుకోవడం, బ్యాంకు ఛార్జీల భారంతో జమ చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడం కూడా కారణం.