ప్రేమించాలంటూ వెంటపడ్డ యువతి: యువకుడి పరుగు, ఏం చేసిందంటే..?
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించాలంటూ ఓ యువతి.. యువకుడి వెంటపడింది. ఆమెకు సాయంగా ఆమె తల్లి కూడా రావడం గమనార్హం.
శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించాలంటూ ఓ యువతి.. యువకుడి వెంటపడింది. ఆమెకు సాయంగా ఆమె తల్లి కూడా రావడం గమనార్హం. కాగా, వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువకుడు పరుగుతీసి పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భద్రావతిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సోమవారం హేమంత్ అనే యువకుడు వ్యాయామ శాలకు వెళ్లి వస్తుండగా సదరు యువతి, ఆమె తల్లి యువకుడి వెంటపడ్డారు. ఎలాగైనా యువతిని వివాహం చేసుకోవాలని పట్టుపట్టారు.
ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకునేందుకు హేమంత్ పోలీసు స్టేషన్కు పరుగుతీశాడు. దీంతో తల్లీ కూతురు కలిసి హేమంత్ మోటార్ సైకిల్ను కిందకు తోసి రాళ్లతో కొట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అంతకుముందు జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఓ స్టీల్ సంస్థలో మెకానికల్ ఇంజినీర్గా పనిచేసే హేమంత్ను సదరు యువతి ప్రేమిస్తోంది. అయితే, అందుకు అతడు నిరాకరించాడు. గత ఏడాది సెప్టెంబరులో తనను అత్యాచారం చేశాడంటూ యువతి ఆరోపించింది. దీంతో హేమంత్ను అరెస్టు చేశారు పోలీసులు.
అయితే ఫోరెన్సిక్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోపణలు నిరాధారమని తేలడంతో హేమంత్ విడుదలయ్యాడు. అకారణంగా తాను నాలుగు నెలల పాటు జైలుశిక్షను అనుభవించాల్సి వచ్చిందని వాపోయాడు హేమంత్. ఇప్పటికైనా సదరు తల్లీకూతుళ్లపై చర్యలు తీసుకోవాలని హేమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.