అమిత్ షాను పట్టించుకోని కేసీఆర్: ఆయనే దగ్గరికి వచ్చినా?.. చివరికిలా!
అలా కేసీఆర్ వద్దకు కూడా వెళ్లినప్పటికీ.. పక్కనే ఉన్న తమిళనాడు సీఎం పళనిస్వామితో ఆయన మాట్లాడుతూ కనిపించడంతో.. అమిత్ షా తన పలకరింపు ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మాజీ ప్రధానులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం జరిగిన సెంట్రల్ హాల్లోకి కేసీఆర్ ప్రవేశించిన వెంటనే టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, మాగంటి మురళీమోహన్, సీతారామలక్ష్మి ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి కొద్ది సేపు ముచ్చటించారు. అలాగే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా మాట్లాడారు.
అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు హాల్లోకి వచ్చారు. అప్పటికే అక్కడ ఆసీనులై వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. అలా కేసీఆర్ వద్దకు కూడా వెళ్లినప్పటికీ.. పక్కనే ఉన్న తమిళనాడు సీఎం పళనిస్వామితో ఆయన మాట్లాడుతూ కనిపించడంతో.. అమిత్ షా తన పలకరింపు ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కేసీఆర్ కూడా ఆయన రాకను అంతగా గమనించినట్లు లేదు.
ఆ తర్వాత అమిత్ షా కేసీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు. అమిత్ షాను గమనించిన కేసీఆర్.. వెనుక నుంచి ఆయన భుజం తట్టారు. కూర్చునే చిరు పలకరింపుతో నమస్కరించారు. ఇక సెంట్రల్ హాల్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్తో కరచాలనం చేశారు.