పెళ్లికి దారితీసిన లింగ మార్పిడి ప్రేమ: అసలేం జరిగిందంటే..?
ఓ వింత సందర్భంలో ఓ మహిళ, పురుషుడి మధ్య ప్రేమ చిగురించింది. లింగమార్పిడి చేసుకునేందుకు వెళ్లిన సందర్భంలో ఆ మహిళ, పురుషుడు ఒకరినొకరు కలుసుకున్నారు.
ముంబై: ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో తెలియదు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వింత సందర్భంలో ఓ మహిళ, పురుషుడి మధ్య ప్రేమ చిగురించింది. లింగమార్పిడి చేసుకునేందుకు వెళ్లిన సందర్భంలో ఆ మహిళ, పురుషుడు ఒకరినొకరు కలుసుకున్నారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో ఆలస్యమెందుకంటూ పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
అక్కడే పరిచయం
ఆ వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అప్పుకుట్టన్(46) అనే మహిళ, సుకన్య క్రిష్ణ అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం ఒకే సమయంలో లింగమార్పిడి కోసం ఓ క్లినిక్కు వెళ్లారు. అక్కడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.
ప్రేమ బంధంగా..
లింగమార్పిడి అనంతరం కూడా వీరి పరిచయం కొనసాగి ప్రేమగా మారింది. దీంతో మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పురుషుడిగా మారిన అప్పుకుట్టన్ మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయంలో రాజ్యాంగబద్దంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
జీవితాంతం..
తన జీవితాంతం సుకన్యక్రిష్ణతో గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాము లింగమార్పిడి చేయించుకున్నందున వివాహానికి ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షిస్తున్నామని తెలిపారు.
ఒక ఫ్యామిలీగా..
తమ లాంటి వివాహానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ సమాజంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తున్నట్లు సుకన్యక్రిష్ణ తెలిపారు. తమకు పిల్ల్ని కనాలని ఉన్నప్పటికీ శారీరక ఇబ్బందుల దృష్ట్యా అది సాధ్యం కావడం లేదని, అయితే, తాము ఓ చిన్నారిని దత్తత తీసుకుంటామని వివరించారు. ఇక మీద తామంతా ఒక ఫ్యామిలీగా ఉంటామని చెప్పుకొచ్చారు.