అమ్మాయిలకు శుభవార్తే!: ఫోన్ నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు
వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లు తమ మొబైల్ నెంబరు చెప్పక్కర్లే కుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.
హైదరాబాద్: సాధారణంగా షాపుల్లోకి వెళ్లి మొబైల్ రీచార్జ్ చేయించుకోవాలంటే ముందుగా మన నెంబరును చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు మనకు కావాల్సిన మొత్తం రీఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే, వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లు తమ మొబైల్ నెంబరు చెప్పక్కర్లే కుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.
ఇటీవల ఓ రీఛార్జ్ షాపులో అమ్మాయిల ఫోన్ నంబర్లను వంద రూపాయల చొప్పున అమ్మేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డ విషయం తెలిసిందే. తన వద్ద రీఛార్జ్ చేయించుకున్న అమ్మాయిల్లో అందంగా ఉన్న అమ్మాయిల ఫోన్ నెంబర్లను ఇంకా ఎక్కువ రేటుకే అమ్మేశాడు.
ఈ నేపథ్యంలోనే రిటైలర్కి నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది వొడాఫోన్. ఇందుకోసం వినియోగదారులు 12604 నంబర్కు 'Private' అని మెసేజ్ పంపాలని, వెంటనే వారి మొబైల్కి వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుందని వొడాఫోన్ ప్రతినిధులు చెప్పారు.
ఆ ఓటీపీని రీటైలర్కి చెబితే చాలు.. రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీసు పశ్చిమ బెంగాల్లో ప్రారంభం అయింది. కాగా, మిగితా టెలికాం సర్వీసులు కూడా ఇలాంటి సదుపాయాన్ని ప్రవేశ పెడితే బాగుంటుందని వినియోగదారులు కోరుతున్నారు.