చేతులెత్తేసిన జగన్: బొత్స వ్యూహం ఉందా?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో వైయస్ జగన్ తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపకపోవడం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బొత్స వ్యూహమే కారణమా...
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అమీతుమీ తేల్చుకుంటానని అంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యర్థులకు ఆయన ఇచ్చిన సంకేతాలు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులను జగన్ ఎందుకు బరిలోకి దింపలేదనే విషయం అంతు బట్టడం లేదు. అయితే, ఎవరికైనా మద్దతు ప్రకటించారా అంటే, అదీ లేదు. మరి ఎందుకు అభ్యర్థులను నిలుపలేదనేది ప్రశ్న. అయితే, ఆ విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక నాయకులకు ఏమైనా తెలుసా అనేది ప్రశ్న.
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ప్రముఖ నేతగా ఉన్నారు. తాను పదేళ్లు మంత్రిగా పనిచేసిన కాలంలో ఉత్తరాంధ్రలో అనుచరగణాన్ని తయారు చేసుకున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా రాజకీయాలను కూడా ఆయనే నడుపుతున్నారని అంటారు. ఈ పరిస్థితుల్లో పట్ట్భద్ర ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మినహా మిగతా ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపిందనేది అంతు చిక్కడం లేదు. అయితే దీని వెనక ఉన్న బొత్స సత్యానారాయణ వ్యూహం ఏమిటనేది కూడా తెలియడం లేదు.
బహుశా, బొత్స సూచన మేరకే జగన్ అభ్యర్థిని దింపకపోయి ఉండవచ్చు. కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ బొత్స సత్యనారాయణ సూచనలపై జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రను మినహాయించి ఉంటారని పలువురు భావిస్తున్నారు.
కాగా, పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆ జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ను ఎన్నికల బరిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దింపింది. ఇక్కడ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎందుకు అభ్యర్థిని నిలుపలేదనేది ఆశ్చర్యకరమైన విషయమే.