శుద్ధిపుజలు అంటే ఏమిటి ఎలాచేస్తారు .? ఎందుకు చేస్తారు ?
ఉదక శాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ. మంత్రజలంతో కాబట్టి దీన్ని “ఉదకశాంతి' అంటారు.
1. పుణ్యాహవాచనం .
సమస్త శుభకార్యాలకు ముందు చేయవలసిన వైదిక ప్రక్రియ "పుణ్యాహవాచనం, దేవతా సంబంధమైన ఉత్సవాల్లోకూడ దీన్ని విధిగా ఆచరిస్తారు. మనుష్య కర్మలకు చేసే పుణ్యాహ వాచనాన్ని 'కర్మణః పుణ్యాహ' మనీ, దేవతా ఉత్సవాల్లో చేసేదాన్ని దేవ పుణ్యాహమనీ అంటారు. గృహాల్లో పుణ్యాహ వాచనం చేసే సమయంలో పురోహితుడు వేదమంత్రాలను పఠిస్తూ ఇంటియజమాని, అతని కుటుంబంసుఖసంతోషాలతో సమృద్ధిగా వండాలని ఆశీర్వదిస్తాడు.
అలాగే, ఆ ఇంట్లో అన్ని దిక్కుల్లో అంతటా పవిత్రత వుండాలని దేవతల్ని ప్రార్ధిస్తాడు. ఆ తరువాత పూర్ణకుంభంలో వున్న మంత్రపూత జలాన్ని కుటుంబ సభ్యులపైన, అప్పడక్కడ వున్న అందరిపైన ఇల్లంతా ప్రోక్షించి, 'తుష్టి రస్తు, పుష్టి రస్తు అంటూ ఆశీర్వదిస్తారు. ఇలా పుణ్యాహ వాచనం చేసేముందు, తాము చేసే కార్యం నిర్విఘ్నంగా జరగాలని విష్వక్సేనుని- వినాయకుని పూజిస్తారు.
2. "ఉదకశాంతి'
ఉదక శాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ. మంత్రజలంతో కాబట్టి దీన్ని "ఉదకశాంతి' అంటారు. దీన్ని ఉపనయనం, వివాహం, స్నాతకం మన్నగు సంస్కారాల్లోను, షష్టిపూర్తి, సహస్రచంద్ర దర్శనోత్సవం, ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునే వారు ఆచరించాలని బోధాయన మహర్షి పేర్కొన్నారు. నాలుగు దిక్కుల్లోను, ఉదక శాంతి జపం చేయడానికి నలుగురు స్వాములను ఆహ్వానించి, పురోహితుడు శుచిగా వుంచిన స్థలంలో స్థండిలాన్ని ఏర్పాటు చేస్తాడు.
స్థండిలం అంటే పూర్ణకుంభం వుంచడానికి నూతన వస్త్రంపై వడ్లు, నూవులు, బియ్యం పోసి ఏర్పాటు చేసే వేదిక. ముందు విష్వక్సేన-వినాయక పూజ, పుణ్యాహవాచనం చేసి, ఆ తరువాత, స్థండిలంపై పూర్ణకలశాన్ని ప్రతిష్టించి, నాలుగు వేదాలలోని వివిధ మంత్రాలు, ప్రక్రియలతో ఉదకశాంతిని పూర్తిచేసి, ఆ మంత్రజలాన్ని తీర్థంగా ఇచ్చి, అందరిపైనా ప్రోక్షించి ఆశీర్వదిస్తారు.