మేం కాదు, ఆయనే: నారాయణరెడ్డి హత్యలో డిజిపి ట్విస్ట్, అదే వెంటాడి చంపింది!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రత్తిపాడు ఇంచార్జ్ చెరుకులపాడు హత్య కేసుపై డిజిపి సాంబశివ రావు సోమవారం వైసిపి నేతలకు కౌంటర్ ఇచ్చారు.
కర్నూలు/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రత్తిపాడు ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసుపై డిజిపి సాంబశివ రావు సోమవారం వైసిపి నేతలకు కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ అండతో ప్రతిపక్ష నేతలకు పోలీసులు భద్రత కల్పించడంలేదని రోజా సహా పలువురు ఆరోపించారు.
చదవండి: తెలిస్తే నారాయణరెడ్డిని రక్షించేవాడ్ని: కేఈ, 'చంద్రబాబు రిజైన్ చేయాలి'
దీనిపై డీజీపీ సాంబశివ రావు స్పందించారు. నారాయణ రెడ్డికి గన్మెన్ను తాము విత్ డ్రా చేయలేదని స్పష్టం చేశారు. ఆయన తనకు తానుగానే గన్మెన్ వద్దనుకున్నారని చెప్పారు. పర్సనల్ గన్ రెన్యూవల్ ప్రాసెస్లో ఉండగానే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు.
మార్చి 31వ తేదీన నారాయణ రెడ్డి గన్ ఎక్స్పరీ డేట్ అయిపోయిందన్నారు. దీంతో ఆయన రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇంతలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ దృష్టిలో అంతా సమానమేనని, ఎవరి ప్రాణాాలైనా విలువైనవే అన్నారు.సెక్యురిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకే ఎవరికైనా గన్మెన్లు కేటాయిస్తామని వెల్లడించారు. ప్రాణహాని కలిగి ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని ఎస్సార్సీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
బయటకు వచ్చినా బలయ్యారు
కాగా, ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకొని, ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ నారాయణ రెడ్డి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు. చెరుకులపాడు నారాయణరెడ్డి గతంలో ఫ్యాక్షన్ నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను న్యాయస్థానం కొట్టివేసింది.
ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకోవద్దని..
నాటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా నారాయణ రెడ్డి మాట్లాడేవారు. దీనివల్ల ఎదురయ్యే అనర్థాలపై ప్రతి సమావేశంలోనూ వివరించేవారు. ఎవరూ ఫ్యాక్షన్ వూబిలో ఇరుక్కోవద్దని హితవు పలికేవారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్షనే ఆయన్ను బలిగొంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
కాపాడేందుకు అనుచరుడి ప్రయత్నం
మొదటినుంచి నమ్మకమైన అనుచరుడిగా ఉంటున్న సాంబశివుడు ప్రతిరోజూ ఆయన వెంట వెళ్లేవారు. ఇదే క్రమంగా నారాయణ రెడ్డితోపాటు ఆదివారం ఉదయం వివాహ వేడుకలకు హాజరయ్యారు. నారాయణరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేయడాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్యర్థులు అతనిపై దాడికి పాల్పడడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు తీశారు. వారు అర కిలోమీటరు మేర వెంబడించి తలపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వెంట వీరు కూడా..
చెరుకులపాడు నారాయణ రెడ్డి వాహనంలో వస్తున్న ఆయన అనుచరులు రామకృష్ణాపురానికి చెందిన పోతురెడ్డి, అల్లుగుండుకు చెందిన శ్రీరాంరెడ్డి, పోతుగల్లుకు చెందిన వెంకటేష్పై ప్రత్యర్థులు దాడికి యత్నించారు. వీరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు.
హంతకులను పట్టుకుంటాం
నారాయణరెడ్డి హత్య విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రవికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసును వేగవంతంగా విచారణ చేపట్టి వెంటనే హంతకులను పట్టుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
టిడిపి వైపు వైసిపి వేలు
నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో వైసిపి నేతలు టిడిపి వైపు వేలు చూపిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, డీజీపీ సాంబశివ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు, చంద్రబాబు కేఈలు కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో స్వర్గీయ ఎన్టీఆర్ సైతం ఇబ్బంది పడ్డారని తెలిపారు. తప్పు ఎవరిదైనా చర్యలు తప్పవన్నారు.
తనకు, చంద్రబాబుకు హత్యలు చేయించాల్సిన అవసరం లేదని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. విచారణలో అన్నీ వెలుగు చూస్తాయన్నారు. జగన్ది దింపుడు కళ్లెం ఆశ అని, ప్రతి దానిని రాజకీయం చేస్తే తనకు ఉపయోగపడుతుందనుకుంటున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో హత్యా రాజకీయాలు ఎవరి హయాంలో జరిగాయో పోలీస్ స్టేషన్లో వివరాలు సేకరిస్తే తెలుస్తుందని వైయస్ ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారు.