వైయస్ జగన్ కు ప్రతికూలమా?
నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ అధిష్ఠాన వర్గానికి లోబడినట్లే కనిపిస్తూ తన సొంత బలాన్ని పెంచుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న శాసనసభ్యులను, మంత్రులను, పార్లమెంటు సభ్యులను చూస్తే ఈ విషయం తెలిసి పోతుంది. వైయస్ రాజశేఖర రెడ్డి అంత బలంగా కాకపోయినా గతంలో మర్రి చెన్నారెడ్డి సొంత బలం పెంచుకున్నారు. ఈ సమయంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి పార్టీ అధిష్ఠాన వర్గం పూనుకుంది. ఇటువంటి వ్యవహారాలు కాంగ్రెసు రాజకీయ చరిత్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పెరుగుతున్న ఒత్తిడికి తలొగ్గితే భవిష్యత్తులో మరింతగా బ్లాక్ మెయిల్ కు గురి కావాల్సి వస్తుందనే భయం పార్టీ అధిష్ఠాన వర్గంలో నెలకొందని అంటున్నారు.
కాంగ్రెసు హస్తిన పెద్దల నియంతృత్వ పోకడల మీద దాడికి పూనుకునే స్వర్గీయ ఎన్టీ రామారావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం మీద ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. అందుకే ఆయన భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థను కోరుకున్నారు. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చే సర్కారియా కమిషన్ సూచనలను అమలు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
కేంద్రంలో ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడాల్సిన స్థితిలో కాంగ్రెసు అధిష్ఠానవర్గం రాష్ట్ర నాయకత్వాలకు కొంత స్వేచ్ఛను ప్రసాందించినట్లు కనిపించింది. ఆ వెసులుబాటును ఆసరాగా తీసుకునే వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని కాంగ్రెసు నాయకుడిగా ఎదిగారు. ఇది ఒక రకంగా పార్టీ అధిష్ఠాన వర్గానికి ప్రమాదం వంటిదే. ఆ ప్రమాదాన్ని ఇప్పుడు చవి చూస్తోంది. జగన్ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే ఆ ప్రమాదం వల్ల మొదటికే మోసం రావచ్చునని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలను ప్రోత్సహించినట్లవుతుందని పార్టీ అధిష్ఠాన వర్గం అనుకుంటూ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ప్రస్తుత పరిణామాలు జగన్ కు ప్రతికూలంగా మారుతాయని భావిస్తున్నారు. ఈ స్థితిలో జగన్ కు కేంద్రంలో ఏదో ఒక పదవి అప్పగించి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరొకరిని ఎంపిక చేసే అవకాశాలున్నట్లు కూడా ఒక వాదన వినిపిస్తోంది. అయితే జగన్ శిబిరం మాత్రం చాలా ఆశతో ఉంది. అసలు విషయం తెలియడానికి ఇంకా చాలా కాలమే పట్టవచ్చు.