తల వంచిన వైయస్ జగన్
బెంగుళూర్ లో ఉన్న జగన్ అధిష్ఠానానికి తన విధేయతను ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. తాము సోనియాకు విధేయులమని ఆయన చెప్పారు. ఖమ్మం సంఘటనను ఖండించారు. నల్లకాలువలో జరిగిన వైయస్ సంస్మరణ సభలో కాంగ్రెసు ప్రస్తావన గానీ, సోనియా ప్రస్తావన గానీ చేయకుండా ధిక్కార స్వరం వినిపించడానికి సిద్ధమైన జగన్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు ఒక్కరొక్కరే రోశయ్య నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతుండడం కూడా జగన్ ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. బెంగుళూర్ లో జగన్ ను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ సోమవారం కలిశారు. రాష్ట్ర మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి కూడా కలిశారు. కెవిపి రామచందర్ రావు కూడా ఆయన వద్దకు వెళ్లారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ ) సమావేశంలో జగన్ వర్గీయులు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది మాత్రం ఇంకా గోప్యంగానే ఉందని చెప్పవచ్చు.