కాంగ్రెసు టెన్షన్, కొడుకుని తీసుకునే పోతా: విజయమ్మ
తన బిడ్డను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి రెండు సార్లు కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెస్తే తమకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా అని ఆమె అడిగారు. తనను, తన కూతురును, తన కోడల్ని వీధిలో నిలబెట్టారని ఆమె మండిపడ్డారు. జగన్ను తీసుకుని వెళ్లేంత వరకు ఇక్కడే ఉంటానని ఆమె చెప్పారు. వాళ్లు కళ్లు తెరవాలని ఆమె అన్నారు. ఎమర్జెన్సీ కన్నా అన్యాయంగా పాలన చేస్తున్నారని ఆమె అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందిని సర్వేలు చెబుతున్నాయని, అందుకే జగన్ను ఇలా చేస్తున్నారని ఆమె అన్నారు.
లోలోన ఎన్నో కుట్రలు చేశారని, అన్నీ భరిస్తూ వచ్చామని ఆమె అన్నారు. కాంగ్రెసుకు వైయస్ చేసిన సేవకు ప్రతిఫలం ఇదా అని ఆమె అన్నారు. తన కొడుకును ఏం చేస్తారో తనకు తెలియడం లేదని ఆమె అన్నారు. వైయస్ జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి భయపడుతున్నారని, ప్రజలకు జగన్ను దూరం చేయాలని అనుకుంటున్నారని ఆమె అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 15 రోజుల తర్వాత సిబిఐ విచారణకు, కోర్టుకు వస్తానని జగన్ చెప్పారని, 15 రోజులకు ఏం పోయిందని ఆమె అన్నారు. తన బిడ్డను ప్రజల చేతుల్లో పెడుతున్నానని ఇది వరకే చెప్పానని, వారి చేతుల్లో పెడుతున్నానని ఆమె అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా నిరసన తెలపాలని ఆమె కోరారు. హింసకు దిగవద్దని సూచించారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆమె కోరారు.
తమపై చాలా కుట్రలు జరుగుతన్నాయని, అన్నీ దేవుడు చూస్తున్నాడని ఆమె అన్నారు. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. తన కుమారుడి అరెస్టుకు సిబిఐ జెడి లక్ష్మినారాయణ సమాధానం చెప్పాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పాలని ఆమె అన్నారు. ఏం జరుగుతోందో తెలియడం లేదు కాబట్టి తాను రోడ్డు మీద కూర్చున్నానని ఆమె అన్నారు. వైయస్ తన జీవితాన్ని కాంగ్రెసు కోసం ఫణంగా పెట్టారని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత ఉందా అనేది కూడా అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని జగన్ సతీమణి భారతి అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాలను సిబిఐ పాటిస్తోందని, అందుకే జగన్ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆమె అన్నారు. అరెస్టు ఉండదని కోర్టు చెప్పిందని, కోర్టు మాటలకు విరుద్ధంగా జగన్ను అరెస్టు చేశారని ఆమె అన్నారు. జగన్ అరెస్టుకు ఏ విధమైన ఆధారాలు లేవని, దేవుడు అంతా చూస్తున్నాడని ఆమె అన్నారు. ప్రజల మధ్య ఉండడం, మాట నిలబడడం నేరమా అని విజయమ్మ అడిగారు. వైయస్ మృతిపై విచారణ కూడా సరిగా చేయలేదని ఆమె ఆరోపించారు. సోనియా ఈగో సంతృప్తి జరగడానికి ఇదంతా జరుగుతోందని ఆమె అన్నారు.
దిల్కుషా అతిథి గృహం వద్ద బైఠాయించిన విజయమ్మను, ఆమె కుటుంబ సభ్యులు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా కమెండోలు కూడా పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనాలను రప్పించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వైయస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ధర్నా విరమించుకోవాలని పోలీసులు వైయస్ విజయమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. విజయమ్మతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భార్య భారతి, సోదరి షర్మిళ రాజభవన్ సమీపంలోని దిల్కుషా అతిథి గృహం వద్ద ప్లాట్ఫారంపై బైఠాయించారు.