జగన్ కేసు: జెడి కాల్ డేటా కోసం సిఐ హ్యాకింగ్
శ్రీనివాసరావును సిఐడి అధికారులు శనివారం రెండో రోజు ప్రశ్నించారు. శ్రీనివాస రావు కింది స్థాయి ఉద్యోగుల సాయంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిసిపి) ఇ - మెయిల్ అకౌంట్ పాస్వర్డ్ను దొంగిలించి, సిడిఆర్స్ కోసం సర్వీస్ ప్రొవైడర్కకు రిక్వెస్ట్ పంపినట్లు చెబుతున్నారు. ఎస్పీ లేదా డిసిపి ర్యాంక్ అధికారికి మాత్రమే ఫోన్ కాల్ డేటా రికార్డుల కోసం రిక్వెస్ట్ పెట్టే అధికారం ఉంటుంది. అటువంటి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా శ్రీనివాస రావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.
లక్ష్మినారాయణ, లీడ్ ఇండియా ప్రతినిధి చంద్రబాల ఫోన్ కాల్ డేటా రికార్డుల లీక్ కేసుల దర్యాప్తును సిఐడి శుక్రవారం తన చేతుల్లోకి తీసుకుంది. లక్ష్మినారాయణ చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయగా, చంద్రబాల సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా రికార్డుల లీకేజీ కేసులో శ్రీనివాస రావుపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ యాదగిరిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో నాచారం సిఐ శ్రీనివాస రావుపై వేటు పడింది. సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు శుక్రవారం సిఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస రావును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో నాచారం సిఐ శ్రీనివాస రావు పాత్ర ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.