చిరంజీవికి ఛాన్స్: మన్మోహన్ సింగ్ కేబినెట్లో మార్పులు
ఈసారి మార్పులలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. చిరు తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడే ఆయనకు అధిష్టానం మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయితే పరిస్థితుల దృష్ట్యా ఇప్పటి వరకు అది నెరవేరలేదు. ఇటీవల రాజ్యసభకు పంపి కేంద్ర పదవికి చిరంజీవిని కాంగ్రెసు మరింత దగ్గర చేసింది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత విస్తరణ ద్వారా హామీని నిలబెట్టుకోనుందని అంటున్నారు.
రాష్ట్రపతి రేసులో ఉండటంతో ప్రణబ్, అవినీతి ఆరోపణలతో వీరభద్ర సింగ్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి స్థానాలను ఫుల్ ఫిల్ చేయడంతో పాటు మార్పులు చేయాలని మన్మోహన్ భావిస్తున్నారట. ప్రస్తుతం మన్మోహన్ వద్దనే ఆర్థిక శాఖ ఉంది. దీనిని మరో సీనియర్ మంత్రికి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. చిదంబరం ఇటీవల దేశ ఆర్థిక పరిస్థితిపై తరుచూ మాట్లాడుతున్నారు.
ఆయన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణబ్కు ముందు ఆర్థి శాఖను చిదంబరమే చూశారు. ఇటీవల పలువురు శాఖలను మార్చారు. ప్రణబ్ కేబినెట్లో ఉన్నప్పుడు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. పలు శాఖలను యువ ఎంపీలకు అప్పగించాలని మన్మోహన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎస్ఎం కృష్ణ ఇటీవల రాహుల్ గాంధీని కేబినెట్లోకి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు నేతలు రాహుల్ కేబినెట్లోకి రావాలని కోరుకుంటున్నప్పటికీ యువనేతకు మాత్రం పెద్దగా ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోంది. గత నెలలో మన్మోహన్ మెక్సీకో, బ్రెజిల్ పర్యటన సందర్భంగా కేబినెట్లో మార్పులపై ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే దానిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన రాష్ట్రానికి చెందిన పశ్చిమ బంగా నుండి ఎవరినైనా తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు ముఖర్జీ ఒక్కరే కాంగ్రెసు తరఫున కేబినెట్లో ఉన్నారు. ఆయన రాజీనామాతో ఆ ఒక్కటీ లేకుండా పోయింది. పశ్చిమ బంగా నుండి కాంగ్రెసుకు ఆరుగురు లోకసభ సభ్యులు ఉండగా తృణమూల్ కాంగ్రెసుకు 19 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం లోకసభ సభ్యులు 42 మంది.
రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య ఒక్కరే ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. త్వరలో గుజరాత్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెసు ఆ రాష్ట్రం వైపు కూడా దృష్టి సారించింది. మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాను కేబినెట్లోకి తీసుకొని పర్యాటక శాఖను అప్పగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాఘేలా గుజరాత్ రాష్ట్ర కాంగ్రెసు ప్రచారం కమిటీ చైర్మన్గా ఉన్నారు.