చేనేత కోసం విజయమ్మ దీక్ష, బిసిల కోసం బాబు పోరు
రైతుల కోసం, ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం ఇలా పలు దీక్షలు హైదరాబాద్, విజయవాడ పలు ప్రాంతాలలో చేపట్టారు. ఆయన ప్రస్తుతం తన అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్నారు. దీంతో జగన్ పాత్రను ఇప్పుడు విజయమ్మ పోషిస్తున్నారు. ఇటీవల ఉప ఎన్నికలలోనూ విజయమ్మ జోరుగా ప్రచారం నిర్వహించారు. పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలపై దీక్షలకు సిద్ధమయ్యారు. సిరిసిల్లలోని తన దీక్ష ద్వారా విజయమ్మ చేనేత కార్మికుల సమస్యలను, కష్టాలను ప్రభుత్వం దృష్టికి తేనున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల బిసిలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. గురువారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బిసిలకు రాజకీయంగా గుర్తింపు తీసుకు వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావే అని చెప్పారు. బిసిలను అణగదొక్కేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వృత్తి పరంగా బిసిలు చితికి పోయారన్నారు.
బిసిలలో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. బిసిలలో వచ్చే చైతన్యం ప్రజా చైతన్యం కావాలన్నారు. బిసిలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. టిడిపి పేదల పార్టీ అని, నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. కాగా టిడిపి ఇటీవల బిసిల పాట పాడుతున్న విషయం తెలిసిందే. తమ పార్టీ వెంట మొదటి నుండి ఉన్న బిసిలు దూరం కావడంతో వారిని దగ్గరకు చేసుకునే ప్రయత్నాలు బాబు చేపట్టారు. అందులో భాగంగానే బిసిలకు వచ్చే ఎన్నికలలో వంద సీట్లు ఇస్తానని ప్రకటించారు.