నేపాల్లో బస్సు ప్రమాదం, 34మంది ఇండియన్స్ మృతి
ఖాట్మాండ్/శ్రీనగర్: నేపాల్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 34 మంది భారతీయులు, కాశ్మీర్లో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది అమర్నాథ్ యాత్రీకులు మృతి చెందారు. నేపాల్లో యాత్రికులతో కిక్కిరిసిన బస్సు ఒకటి కాలువలో పడి.. 34 మంది భారతీయ భక్తులు సహా మొత్తం 39 మంది మరణించారు. వారిలో ఐదేళ్ల బాలికతోపాటు పదిమంది మహిళలు కూడా ఉన్నారు.
ఖాట్మండుకు 250 కిలోమీటర్ల దూరంలోని గండకి కాలువలో బస్సు పడింది. మరణించిన వారిలో ఉత్తర ప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన వారు, బీహార్లోని ధులినిపుల్కు చెందిన వారు ఉన్నట్లుగా భారతీయ ఎంబసీ తెలిపింది. వీరంతా నేపాల్లోని నవాల్పారసి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం నాడు ఈ ప్రమాదం జరిగింది.
మరోవైపు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15మంది అమరనాథ్ యాత్రికులు మరణించారు. జమ్మూ - శ్రీనగర్ రహదారిలో శనివారం రాత్రి 11.30 గంటలకు బస్సు ఒకటి లోయలో పడింది. ఈ సంఘటనలో 16 మంది యాత్రికులు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.
వీరంతా అమరనాథ్ వెళ్లి వస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రా పట్టణం సమీంపంలో ఆదివారంనాడు యాత్రికుల బస్సు ఒకటి లోయలో పడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన వీరంతా అమరనాథ్ వెళ్లి వస్తూ ప్రమాదంలో చనిపోయారు. కాగా అమరనాథ్ యాత్రికుల మృతిపై ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రూ. లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.10వేల చొప్పున మంజూరు చేశారు.