ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్, టిడిపి నేత బివి కన్నుమూత
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, టిడిపి ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా పని విధులు నిర్వర్తించారు. తాజా ఉప ఎన్నికలలో బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నుండి పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్య్రర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించింది.
ఉప ఎన్నికల ప్రచార బిజీలో ఉన్న మోహన్ రెడ్డి హైదరాబాద్లో చికిత్స చేయించుకునేందుకు నిరాకరించారు. ప్రచారం అయిపోయాక వెళతానని చెప్పరు. కానీ పార్టీ నేత కెఈ కృష్ణమూర్తి పట్టుబట్టడంతో ఆయన హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి ఉప ఎన్నికల ప్రచారంలో స్ట్రెచర్తోనే పాల్గొన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి బివి మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుత కేంద్రమంత్రి పురంధేశ్వరి, హీరో నందమూరి బాలకృష్ణలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి తన చేతులతో ఆడించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పురంధేశ్వరి పార్టీ పెద్దలు కోరినప్పటికీ ఎమ్మిగనూరుకు మాత్రం వెళ్లలేదు.
అందుకు బివి మోహన్ రెడ్డికి నందమూరి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని తెలుస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్కు జ్యోతిష్యం చెప్పి బివి ఆయనకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణిస్తారని బివియే జ్యోతిష్యం చెప్పారు. రాజకీయ జ్యోతిష్యాల్లో దిట్టగా ఆయనకు పేరుంది. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుకు కూడా ఆయన జ్యోతిష్యం చెప్పారు. చంద్రబాబు, పలువురు నేతలు సంతాపం తెలిపారు.