విజయమ్మ దీక్షపై కిరణ్ కామెంట్, ప్రభుత్వానిదే ఫైనల్
మేనేజ్మెంట్ కోటా భర్తీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని 550 ప్రయివేటు, 30 ప్రభుత్వ కళాశాలలతో ఎలాంటి సమస్య లేదని, కేవలం 85 కళాశాలలతోనే సమస్య ఉందన్నారు. అయినా వాటిపై కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున బోధనా రుసుము లేదని, కాంగ్రెసు హయాంలోనే ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకుంటుందని, కాయలు కాసే చెట్టుకు ఎక్కువ రాళ్లు అన్నట్లు పని చేస్తున్న తమ ప్రభుత్వం పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుసునని, వారు అన్నీ అర్థం చేసుకుంటున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, మీడియాకు చెప్పే చేస్తానని కిరణ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇందిర బాట షెడ్యూల్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు ఉందన్నారు.
ప్రచారం కోసమే.. గండ్ర
పార్టీ ప్రచారం కోసమే వైయస్ విజయమ్మ ఫీజు దీక్షను చేపట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంక రమణ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్పై విపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.