కార్టూనిస్టు అసీం త్రివేది విడుదల: ఘనస్వాగతం
అసీం త్రివేది అరెస్టుపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగింది. పార్లమెంటును, జాతీయ పతాకను, జాతీయ చిహ్నాన్ని అవమానించాడనే ఆరోపణలపై అసీం త్రివేది అరెస్టయ్యారు. దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం సాగిస్తానని విడుదలైన తర్వాత అసీం త్రివేది చెప్పారు.
తనపై రాజద్రోహం కింద చేసిన నేరారోపణలను ఉపసంహరించుకునే వరకు తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఆయన తనను తాను స్వాతంత్ర్య సమరవీరులతో పోల్చుకున్నారు. గాంధీ, నెహ్రూలపై కూడా రాజద్రోహం కేసులు పెట్టారని, వారు దేశభక్తులు కారా అని ఆయన అన్నారు.
కోర్టు కేసులన్నిటికీ తాను సహకరిస్తానని, రాజద్రోహం కింది నేరారోపణను తాను అంగీకరించబోనని ఆయన అన్నారు. తన విడుదలకు మాత్రమే పోరాటం సాగదని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే అన్ని నిబంధనలపై తన పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు.
ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బొంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్ను తీసుకోవడానికి ఆయన తొలుత నిరాకరించారు. బెయిల్ను అంగీకరించడానికి ఆయన తండ్రి అశోక్ త్రివేది కూడా నిరాకరించారు. తన కుమారుడు ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన అన్నారు.