... ఇది జగన్ కుటుంబ చరిత్ర: ఆస్తులపై రేవంత్ సవాల్
అందువల్లే బాబు ఆస్తులు రెండెకరాల నుండి ఇంత స్థాయికి ఎదిగారన్నారు. వైయస్ జగన్లు అక్రమాలు చేసి కోట్లు సంపాదించలేదన్నారు. బాబు ఆస్తులపై ఆరోపణలు అవాస్తవమని, లేనివి కల్పించి ప్రచారం చేస్తూ జగన్ పార్టీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. బాబు ఇటీవల ప్రకటించిన ఆస్తుల విలువ స్పష్టంగా ఉందని, అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆస్తుల ప్రకటన చేశారని తెలిపారు. బాబు ప్రకటించిన ఆస్తులు కాకుండా వేరే ఆస్తులు చూపిస్తే అవి చూపించిన వారి పేర రాయడానికి సిద్ధమని అన్నారు.
ప్రపంచంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కానీ జగన్ కుటుంబం మాత్రం అలా కాదన్నారు. వైయస్ జగన్ ముత్తాత బతకలేక దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీకి వత్తాసు పలికి, వారితో కలిసి వ్యాపారం చేసి మతం మార్చుకున్న వ్యక్తి అన్నారు. జగన్ తాత రాజారెడ్డి రౌడీషీటర్ అన్నారు. పులివెందులలో రౌడీషీట్ కూడా ఉందన్నారు. జగన్ తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డం వచ్చిన వాళ్లను బెదిరించి లొంగదీసుకొని వేల కోట్లు దండుకున్న వ్యక్తి అని ఆరోపించారు.
జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్న వ్యక్తి అన్నారు. ఇది జగన్ కుటుంబ చరిత్ర అన్నారు. ఇవన్నీ తాను చేస్తున్న ఆరోపణలు కాదని, గతంలో ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రికలో వచ్చాయన్నారు. పత్రికలో వచ్చిన వార్తలు అబద్దమైతే జగన్ పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పరువు నష్టం దావా వేస్తే ఎక్కడ మరిన్ని తమ కుటుంబ చీకటి కోణాలు బయట పడతాయో అనే భయంతోనే వారు కేసు వేయలేదన్నారు.
ముత్తాత దేశద్రోహి, తాత రౌడీ, తండ్రి అక్రమార్కుడు, జగన్ దోపిడీదారుడు అని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు ఆస్తులపై విష ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ భారత్లో ఉంటే వారిని కూడా బాబు బినామీలు అనే వారన్నారు. బలపనూరులో భోజనానికి లేకుంటే బెంగళూరులో భవంతులు ఎలా వచ్చాయో జగన్ చెప్పాలన్నారు. బాబు ఆస్తులపై విష ప్రచారం చేస్తున్న వారికి తాను సవాల్ చేస్తున్నానని... బాబు భవంతులలోకి మీడియాకు అనుమతిస్తున్నామన్నారు.
మీడియా వచ్చి బాబు భవంతిని అంచనా వేయవేసి.. అది ఏ తరహా భవనమో చూసుకోవచ్చన్నారు. జగన్ కూడా పులివెందులోని, లోటస్ పాండులోని, కడపలోని, బెంగళూరులోని భవంతులలోకి మీడియా సందర్శనకు అనుమతించాలని సవాల్ చేశారు. ఎవరివి ఏ తరహా ఇళ్లో వారే తేలుస్తారన్నారు. జగన్ తన భవనాల్లోకి మీడియాను అనుమతించేందుకు సిద్దమైతే వెంటనే తన సవాల్ పైన ప్రతిస్పందించాలన్నారు.