బాబు పాదయాత్ర: వాస్తు భయంతో ఆదిలాబాద్కు స్వస్తి
జ్యోతిష్కుల సలహా మేరకు ఆయన ఆదిలాబాద్ నుంచి పాదయాత్రను ప్రారంభించాలనే ఆలోచనకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పాదయాత్రకు ముందే తెలంగాణపై పార్టీ వైఖరిని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. కేంద్రం ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశంలోనే తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పాలని ఆయన తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ అంశంపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారంటూ చంద్రబాబుపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలో ప్రత్యేక వాదాన్ని, అటు సీమాంధ్రలో సమైక్యవాదాన్ని ఆయన బలపరుస్తూ వస్తున్నారు. దీంతో తెలంగాణలో చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఈ ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు.
చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమై 117 రోజుల పాటు సాగి గణతంత్ర దినోత్సవం రోజు వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ముగుస్తుంది. రోజుకు 20 కిలోమీటర్ల నడక సాగించాలని ఆయన అనుకుంటున్నారు. ఆ రకంగా రెండు వేల కిలోమీటర్లకు పైబడి పాదయాత్ర చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. కోరితే పాదయాత్రలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు బావమరిది, సినీ హీరో బాలకృష్ణ చెప్పారు.