భారత్ బంద్ పాక్షికం: సైకిల్పై అసెంబ్లీకి టిడిపి ఎమ్మెల్యే
రాజధాని హైదరాబాదులో వ్యాపార సముదాయాలు దాదాపు తెరవక పోయినప్పటికీ ఆర్టీసి బస్సులు మాత్రం రోడ్లపై యథావిథిగా తిరుగుతున్నాయి. కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే జిల్లాల నుండి వచ్చే బస్సులను మాత్రం అఖిలపక్షం నేతలు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పలు జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. అఖిలపక్ష నేతలు అన్ని బస్ డిపోల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాదులో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద వామపక్ష, టిడిపి, బిజెపి నేతలు బస్సులను నిలిపివేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీ నేతలు పెంచిన డీజిల్ ధరలను, వంట గ్యాస్ కోతను నిరసిస్తూ గన్ పార్క్ సమీపంలో కట్టెల పొయ్యిపై వంట చేసి తమ నిరసనను తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైకిల్ పైన అసెంబ్లీకి వచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు.
భారత్ బంద్ ప్రభావం దేశవ్యాప్తంగా సామాన్యుడిపై ప్రభావం చూపింది. దేశవ్యాప్త బందుకు పలు రాష్ట్రాలలో వ్యాపార సంస్థలు, సంస్థలు, వాహన యూనియన్లు మద్దతు పలికాయి. బందు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 75 లక్షల ట్రక్కులు రోడ్డెక్కలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి ఆ నగరానికి వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేసింది. మెట్రో సర్వీసెస్ నడుస్తున్నప్పటికీ, ఆటోలు రోడ్డెక్కలేదు. పాఠశాలలు మూతపడ్డాయి.
ఉత్తర ప్రదేశ్లో అఖిల పక్షం నేతలు రైళ్లను ఎక్కడికి అక్కడ ఆపేశారు. బందులకు వ్యతిరేకమని చెప్పిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాధికారులు కార్యాలయాలకు రావాల్సిందిగా హుకూం జారీ చేసింది. గణేష్ చతుర్థి నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు బందును పాటించడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభావం అంతగా కనిపించడం లేదు. అయితే పలు వాణిజ్య సముదాయాలు, వాహనదారులు స్వచ్చంధంగా బందు పాటిస్తున్నారు. కర్నాటక, కేరళ, తమిళనాడులలో బంద్ ప్రభావం కనిపిస్తోంది.