పలికేది నామా, పలికించెడువాడు బాబు: కెటిఆర్
ఖమ్మంలో తనపై పోటీ చేయాలని కెసిఆర్కు నామా నాగేశ్వర రావు సవాల్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నామా నాగేశ్వర రావు తెలంగాణ ముసుగులో ఉన్న సమైక్యవాది అని తేలిపోయిందని కెటిఆర్ అన్నారు. ఆ ప్రకటన ద్వారా నామా నాగేశ్వర రావు ఖమ్మంలో తెలంగాణవాదులను అవమానించారని ఆయన అన్నారు 1969 తెలంగాణ ఉద్యమానికి ఖమ్మంలో రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షతోనే నాంది పలికిందనే విషయం నామాకు తెలియదని ఆయన అన్నారు.
కెసిఆర్ను ఖమ్మంలో నిర్బంధిస్తే ఖమ్మం బిడ్డలు సత్తా చాటిన విషయం నామా మరిచిపోయారా అని ఆయన అడిగారు. ఖమ్మంలో తెలంగాణవాదం లేదని భావిస్తే నామా నాగేశ్వర రావు రాజీనామా చేసి సమైక్యవాదం పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణవాదులకు నామా నాగేశ్వర రావు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నామా నాగేశ్వర రావు వ్యాఖ్యలపై తెరాస శాసనసభ్యుడు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా మండిపడ్డారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేనది ఆయన అడిగారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్పై వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు.
తెలంగాణలోని పాల ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. పాల సేకరణ విషయంలో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని వారు ముఖ్యమంత్రితో భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. నెలలో మూడు రోజుల పాటు తెలంగాణలో పాల సేకరణ నిలిపేస్తామని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
హెరిటేజ్, ఇతర ప్రైవేట్ డెయరీ సంస్థలు కుమ్మక్కయి పాల సేకరణ ధరను రెండు రూపాయలకు తగ్గించాయని, వినియోగదారులకు మాత్రం ధరను తగ్గించలేదని వారు చెప్పారు. ప్రభుత్వం వెంటనే కల్తీ పాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. పాల సేకరణలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించబోమని వారన్నారు. సీమాంధ్ర నుంచి వచ్చే పాల ట్యాంకర్లను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.