పోలవరం టెండర్లలో గోల్మాల్: హరీష్ రావు ఫైర్
ఫోర్జరీ పత్రాలతో ట్రాన్స్ టాయ్ టెండర్లు దాఖలు చేసిందని ఆయన అన్నారు. ట్రాన్స్ టాయ్ టెండర్లు ఫోర్జరీ పత్రాలతో దాఖలు చేసిందనే విషయాన్ని రష్యన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తెలిపిందని చెప్పారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ట్రాన్స్ టాయ్ కంపెనీ పత్రాలను పరిశీలించేందుకు వెళ్లిన ఇంజనీర్లు ట్రాన్స్ టాయ్ ఏర్పాటు చేసిన విలాసవంతమైన హోటళ్లలో బస చేశారని, వారు ఏర్పాటు చేసిన కార్లలోనే తిరిగారని ఆయన ఆరోపించారు.
ఇంజనీర్లు విలాసవంతమైన కార్లలో తిరిగిన ఫొటోలను, హోటళ్లలో బస చేసినట్లు నిరూపించే రశీదులను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. రష్యాలో ఉన్న భారత దౌత్య కార్యాలయానికి కూడా ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. నేతి బీరకాయలో ఎంత నేయి ఉంటుందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో అంత నీతి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
పోలవరం టెండర్లపై ముఖ్యమంత్రి నిజాయితీగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. టెండర్లను శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఖరారు చేశారని, అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత పన్నెండున్నర గంటలకు ఒప్పందం చేసుకున్నారని, ఎవరూ కోర్టుకు వెళ్లడానికి వీలు లేకుండా సెలవు రోజులు చూసి, రాత్రిపూట పనులు పూర్తి చేశారని ఆయన అన్నారు.
పంజాబ్లోని షాపూర్కండీ ప్రాజెక్టు టెండర్లలో అనర్హతకు గురైన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పోలవరం టెండర్ల విషయంలో ఎలా అర్హత సాధించగలదని ఆయన అడిగారు. తప్పును ఒప్పు చేయడానికే అర్థరాత్రి ఒప్పందం చేసుకున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.