చంద్రబాబు కౌంటర్ అటాక్: కిరణ్పై జగన్ రెడీ
అవిశ్వాసానికి మద్దతిచ్చే వారు గవర్నర్ ఎదుట పరేడ్ నిర్వహించాలని టిడిపి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో తామే ఇతర పార్టీలను లేదా సభ్యులను కలుపుకొని అవిశ్వాసం పెట్టాలని జగన్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజే నోటీసు ఇచ్చేందుకు సన్నద్దమవుతోందట. కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు పేర్ని నాని, శిరియా సాయిరాజ్, తానేటి వనిత తదితరులు జగన్ వెంట వెళ్తున్నారు.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు 17 మంది. టిడిపి, కాంగ్రెసుల నుండి వచ్చిన వారితో కలుపుకుంటే అది పాతిక వరకు ఉంటుంది. మరికొందరిని కలుపుకొని తామే అవిశ్వాసం పెడితే బాగుంటుందని ఆ పార్టీ యోచిస్తోంది. మజ్లిస్ పార్టీ కూడా జగన్ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మొత్తానికి తమ సవాళ్లకు టిడిపి కౌంటర్ అటాక్ చేస్తుండటంతో తామే అవిశ్వాసం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణ బాబు, వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళిల పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పుడున్న పదిహేడు మందికి తోడు తమతో కలిసి వచ్చే ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఒక స్థానాన్ని కైవసం చేసుకోవచ్చునని జగన్ పార్టీ భావిస్తోంది. మరొకరిని నిలబెట్టే విషయమై తర్జన భర్జన పడుతోంది.