ఎమ్మెల్సీ: దాడి రాజీనామా యోచన, మరొకరి కంటతడి
శాసన మండలిలో టిడిపి పక్ష నేతగా ఉన్న దాడి తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు లభించకపోవడంతో ఆవేదనకు గురయ్యారట. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉన్నా మనస్తాపం కారణంగా ఇప్పుడే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ దఫా యనమలకు అవకాశం ఇవ్వాలని బాబు నిర్ణయించారు. అయితే, ఈ విషయాన్ని తనతో కొంత ముందుగా చెప్పి ఉంటే బాగుండేదని, పొలిట్ బ్యూరో సమావేశానికి పిలిచి, అప్పుడే చెప్పడం తనను మనస్తాపానికి గురి చేసిందని దాడి ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీలో సీనియర్నైన తాను మరోమారు కొనసాగింపు కోరుకోవడంలో తప్పు లేదని, అయితే, పార్టీ నిర్ణయాన్ని తనకు ముందే చెప్పి ఉంటే బాగుండేదని భావిస్తున్నారట.
విశాఖలో చిచ్చు
దాడి వీరభద్ర రావుకు ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం ఇవ్వకపోవడంతో పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానానికి వారు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట.
కోటేశ్వర రావు కంట తడి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర రావు తనకు అవకాశం దక్కకపోవడం పట్ల కంటతడి పెట్టారు. వికలాంగుడైన కోటేశ్వర రావు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం నుండి మూడు చక్రాల వాహనంపై యాత్రలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల కసరత్తు దృష్ట్యా తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించారు. కానీ, చోటు దక్కకపోవడంతో కంటతడి పెట్టారు. దీంతో, బాబు, వర్ల రామయ్య ఆయనను ఓదార్చారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.