అప్పుడే రాజకీయ రుచి: జూ ఎన్టీఆర్ మదిలో ఏముంది?
చంద్రబాబు నాయుడు అనంతరం టిడిపి తన చేతిలోకి వస్తుందని జూనియర్తో పాటు తండ్రి నందమూరి హరికృష్ణ కూడా భావించారనే వాదన మొదటి నుండి వినిపిస్తోంది. అయితే, టిడిపిలో లోకేష్కు ప్రాధాన్యత పెరగడంతో జూనియర్ జీర్ణించుకోలేక పోయారు. ఈ అంశం అప్పట్లో జూనియర్ వర్సెస్ టిడిపిగా మారిపోయింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లే కనిపించినా లోకేష్ టిడిపిలో ఇటీవల కీలకంగా మారుతుండటం, తనను పక్కకు పెట్టడాన్ని జీర్ణించుకోలేని జూనియర్ బల ప్రదర్శన చేశారంటున్నారు.
టిడిపి బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఎన్టీఆర్ మదిలో బాగా నాటుకొని ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. 2014లో కాకపోయినా 2019 నాటికి టిడిపిని అధికారంలోకి తెచ్చి ఆ ముఖ్య పదవిలో కూర్చోవాలనే భావనలో జూనియర్ ఉన్నారంటున్నారు. అందులో భాగంగానే తన సత్తా చాటి ప్రాధాన్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. లోకేష్ స్థానంలో జూనియర్ ఉండాల్సిందనే భావన పలువురిలోనూ ఉందంటున్నారు.
2009లోనే రాజకీయం అబ్బిందా?
జూనియర్ ఎన్టీఆర్కు 2009లోనే రాజకీయం అబ్బిందంటున్నారు. అప్పుడు జూనియర్ ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. అప్పటి నుండే అతని దృష్టి రాజకీయాల వైపు మళ్లినట్లుగా కనిపిస్తోందంటున్నారు. నాటి నుండి జూనియర్ పార్టీలో ఎదిగేందుకు తెరవెనుక రాజకీయంగా పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే రాజకీయాలు రుచి చూసిన జూనియర్.. లోకేష్ ఎదిగితే పార్టీ పగ్గాలు దక్కయనే ఆందోళనలో ఉండి ఉంటారంటున్నారు.