తెలంగాణపై వాయలార్ రవి రొటీన్: టిడిపిపై జోషీ
తెలంగాణపై ఏం జరుగుతుందనేది తనకు తెలియదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యుపిఎ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే తెలంగాణ అంశం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తన పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు.
కళంకిత మంత్రులపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. చర్యలు తీసుకోవాలా, వద్దా అనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డికే వదిలేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తానేమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చూడడం లేదని ఆయన అన్నారు.
ఎన్డియే అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మైనారిటీలు గుర్తుకు రారరని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అన్నారు. వారే తమతో కలుస్తారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమపై మైనారిటీ వ్యతిరేక ముద్ర వేసేవారికి తాము అధికారంలోకి ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు.
యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు. విదేశీ సంబంధాలపై వాజ్పేయి విధానాలే తమకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. సిబిఐ, కాగ్ వంటి సంస్థలకు స్వయంప్రతిపత్తి ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. సిబిఐ విషయంలో రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని అన్నారు.