చెవిరెడ్డి అరెస్ట్, వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు, ఉద్రిక్తత: చిన్న విషయమన్న కాల్వ
రవాణా అధికారిపై దాడికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
అమరావతి: రవాణా అధికారిపై దాడికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట దీక్షకు దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీక్ష చేస్తున్న చెవిరెడ్డిని, మార్షల్స్ సాయంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు బస్సులోకి ఎక్కించి, అక్కడి నుంచి తరలిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు బస్సును అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మా వెంటపడి అరెస్ట్ చేసి.. నాని, ఉమలపై ఎందుకిలా?: బాబును ఏకేసిన చెవిరెడ్డి
కాగా, ఇంతలోనే బస్సులో నుంచి కిందకు దూకిన చెవిరెడ్డి.. అసెంబ్లీలోకి వెళ్లేందుకు పరుగు తీశారు. దీంతో మరోమారు మార్షల్స్ ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్షల్స్, వైసీపీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది. అధికార తెలుగుదేశం తమపై దౌర్జన్యానికి దిగుతోందని ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు ఆరోపించారు..
వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
చిన్న విషయమే: కాల్వ
రవాణాశాఖ అధికారులతో టీడీపీ నేతలు కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావులు వాగ్వాదానికి దిగడం చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్లు ఇప్పటికే క్షమాపణలు చెప్పేశారని... దీంతో, ఈ వివాదం ముగిసిపోయిన అంశమని చెప్పారు.