సభలో వైసీపీ ఆందోళన: జగన్ పార్టీది అరాచకమంటూ గోరంట్ల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. మొదట స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. మొదట స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే, పదో తరగతి పేపర్ లీకేజీ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు.
ప్రశ్నోత్తరాల తర్వాత ఏ అంశంపైన అయినా చర్చ చేపడదామని స్పీకర్ నచ్చజెప్పినా వారు వినిపించుకోకుండా సభలో నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరికాదని, సమయం వృథా కాకుండా సభ నిర్వహణకు ప్రతిపక్షం సహకరించాలని టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు సూచించారు.
ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షం అరాచక విధానాన్ని స్పీకర్ ఆపాలని, సభ్యుల హక్కులు కాపాడేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ మరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.