నేపాల్: బయటపడ్డ 14మంది తెలుగువారు, చిక్కుకున్న 300మంది
ఖాట్మాండ్/హైదరాబాద్: నేపాల్ భారీ భూ కంపంలో చిక్కుకున్న 14 మంది తెలుగువారిని సహాయక బృందాలు కాపాడాయి. కాగా, మరో 300 మంది తెలుగువారు ఖాట్మాండ్, పరిసర ప్రాంతాల్లోనే చిక్కుకుని ఉన్నారు.
సహాయక బృందాలు కాపాడిన వారిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప, విశాఖపట్నం, తెలంగాణ జిల్లాలకు చెందిన వారున్నారు. కడప, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలకు సోమవారం రాత్రి చేరుకున్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం విశాఖపట్నానికి కొంతమంది చేరుకున్నారని తెలిపారు.
నేపాల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గోరఖ్పూర్ చేరుకున్న మరో 60మంది విద్యార్థులను గోరఖ్పూర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ఏపిలోని వారి వారి ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.
ఐఏఎఫ్ విమానం కోసం వేలాది మంది భారతీయులు ఖాట్మాండ్ ఎయిర్ పోర్టులో వేచివున్నారని అధికారులు తెలిపారు. కాగా, చిక్కుకుపోయిన తెలుగువారి నుంచి సోమవారం అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని ఏపి, తెలంగాణ హెల్ప్లైన్ అధికారులు తెలిపారు.
తాము రెస్క్యూ బృందాలకు సమాచారం ఇచ్చామని, వారు చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడేందుకు వెళ్లారని ఢిల్లీలోని ఏపి భవన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, రెండు రోజులుగా జాడలేని హైదరాబాద్కు చెందిన నీలిమ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆచూకీ కూడా మంగళవారం లభ్యమైంది. ఆమె సురక్షితంగా ఉన్నట్లు ఆమె స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.