చిత్తూరులో విషాదం: దుకాణాలపైకి దూసుకెళ్లిన లారీ, 20 మంది మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి దుకాణాలపైకి దూసుకెళ్లడంతో 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఘోరం జరిగింది.
ఘటనా స్థలంలో బీభత్స దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఏర్పేడు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత వారిపైకి దూసుకెళ్లింది.
పూతలపట్టు - నాయుడుపేట ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఏర్పేడు సమీపంలోని పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, మృతి చెందిన వారిలో.. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు అక్కడ టీ షాప్లో చాయ తాగుతుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు నారాయణ, ఆదినాారాయణ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు.