గుంటూరు జిల్లాలో దారుణం: 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్
అమరావతి: మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోడేపుడివారిపాలెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన బాలిక (16) వినుకొండ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 15వ తేదీన స్కూలు పూర్తవగానే బస్సులో గ్రామానికి బయల్దేరింది.
ఇంతలో అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు పుస్తకాలు కొనిస్తానని బైక్పై ఎక్కమన్నాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ బాలిక బైక్ ఎక్కింది. ఆ తర్వాత ఆ యువకుడు వాహనాన్ని ఎక్కడా ఆపకుండా అటవీ ప్రాంతంలోనికి తీసుకెళ్లాడు.
మార్గం మధ్యలో అతనికి తోడుగా తన ఇద్దరు మిత్రులైన గోపి, మరియబాబులను కూడా సాయంగా రమ్మన్నాడు. దీంతో ముగ్గురు అటవీ ప్రాంతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను బస్టాండ్లో వదిలేశారు.
జరిగిన విషయాన్ని బాలిక గుంటూరులో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆదివారం రాత్రి ఈపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గిద్దలూరు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తండాలోని పొలంలో మహిళ మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. మెడలో నగలు లేకపోవటంతో దోపిడీ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.