ఏవోబీలో భారీ ఎన్కౌంటర్: 24మంది మావోలు మృతి, కీలక నేతలు కూడా!
మల్కాన్గిరి/విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు మల్కాన్గిరి సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసు బలగాలుఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆదివారం నుంచే ఏపీ, ఒరిస్సా పోలీసు బలగాలు ఏవోబీని జల్లెడపడుతున్నాయి.
ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా, మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసు బలగాలు ఎదురుకాల్పులకు దిగారు.
అగ్రనేతలు మృతి
కాగా, ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. కాగా, కాల్పుల్లో అగ్రనేత ఉదయ్ తోపాటు ఆయన దళ సభ్యులు మొత్తం మృతి చెందినట్లు సమాచారం.
చనిపోయిన వారిలో స్థానిక గిరిజనులు కూడా ఉన్నట్లు సమాచారం. అగ్రనేత చలపతితోపాటు 8మంది మహిళలు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది.కాగా, సెంట్రల్ కమిటీ సభ్యుడు గాదర్ల అశోక్ కాల్పుల నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఎన్కౌంటర్ అనంతరం మృతి చెందిన మావోయిస్టుల వద్ద నాలుగు ఏకే47, భారీగా ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొనసాగుతున్న గాలింపు డీజీపీ
ఇంకా గాలింపు కొనసాగుతోందని, ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 19మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు ఆయన తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతోనే పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. మృతుల్లో మావో అగ్రనేతలు కూడా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. కాగా, ఆయన హైదరాబాాద్ నుంచి విశాఖకు బయల్దేరివెళ్లారు.
ఇప్పుడే చెప్పలేం: ఎస్పీ
ఏవోబీ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన వివరాలు ఇప్పుడే చెప్పలేమని విశాఖ ఎస్పీ రాహుల్దేవ్ శర్మ స్పష్టం చేశారు. మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతులను నిర్ధారించి అప్పుడే వివరాలు వెల్లడిస్తామన్నారు.