నారాయణరెడ్డి హత్యపై డ్రైవర్ ఇలా, వెపన్ లైసెన్స్ రెన్యూవల్ లో ఉంది, పోలీసుల అదుపులో ఇద్దరు
కొండ వైఎస్ఆర్ సిపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని విచక్షణరహితంగా వేటకొడవళ్ళతో దాడిచేసి హత్యచేశారని డ్రైవర్ ఎల్లప్ప పోలీసులకు వివరించారు. పకడ్బందీప్లాన్ ప్రకారమే ఆయనను హత్యచేశారన్నారు.
కర్నూల్: పత్తికొండ వైఎస్ఆర్ సిపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని విచక్షణరహితంగా వేటకొడవళ్ళతో దాడిచేసి హత్యచేశారని డ్రైవర్ ఎల్లప్ప పోలీసులకు వివరించారు. పకడ్బందీప్లాన్ ప్రకారమే ఆయనను హత్యచేశారన్నారు.మరోవైపు నారాయణరెడ్డి వెపెన్ లైసెన్స్ రెన్యూవల్ ప్రాసెస్ లో ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఉదయంపూట పెళ్ళికి హజరై తిరిగివస్తుండగా నారాయణరెడ్డిని ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కర్నూల్ జిల్లాలో ఇటీవలకాలంలో వైసీపీకి చెందిన నలుగురు నాయకులు హత్యకు గురయ్యారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇద్దరు, పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి తోపాటు ఆయన అనుచరుడు హత్యకు గురయ్యాడు.
ఈ హత్యలు రాజకీయంగా అధికారపార్టీని ఇరుకునపెడుతున్నాయి. అయితే వైసీపీ నేతలు ఈ విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కర్నూల్ జిల్లా బంద్ నిర్వహిస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
డ్రైవర్ ఏం చెప్పాడంటే?
పెళ్ళి నుండి తిరిగి వస్తుండగా 20 మంది దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్ళతో దాడిచేసి నారాయణరెడ్డిని నరికి చంపారని డ్రైవర్ ఎల్లప్ప చెప్పారు. అడ్డుపడిన సాంబశివుడిని కూడ కిరాతకండా హతమార్చారని చెప్పారు. నారాయణరెడ్డి, సాంబశివుడు చనిపోయిన తర్వాత సంఘటన స్థలం నుండి పారిపోయారని చెప్పారు.తనను తరిమేయడంతో తాను పారిపోయానని ఎల్లప్ప చెప్పాడు.రామకృష్ణాపురం కల్వర్టు వద్ద దుండగులు కాపుకాసి తమ కోసం ఎదురుచూశారని ఎల్లప్ప చెప్పారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు
నారాయణరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ నిందితుల నుండి విషయాన్ని రాబడుతున్నారు. హత్యకు సంబంధించిన పూర్తివివరాలను సేకరిస్తున్నారు. ఎందుకు నారాయణరెడ్డిని హత్య చేయాల్సివచ్చింది. ధీని వెనుక ప్రధాన పాత్రధారులెవరనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రైవర్ ఎల్లప్ప చెప్పిన ప్రకారంగా ఈ ఘటనలో 20 మంది పాల్గొన్నారు. మిగిలినవారు ఎక్కడికి వెళ్ళారనే విషయాలను ఆరాతీస్తున్నారు. మరో వైపు హత్య సమయంలో ఉపయోగించిన ట్రాక్టర్ ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
లైసెన్స్ రెన్యవల్ ప్రాసెస్ లో ఉంది
చెరుకులపాడు నారాయణరెడ్డి తోపాటు జిల్లాలోని అందరి లైసెన్స్ డ్ తుపాకులను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డిపాజిట్ చేసుకొన్నట్టు పోలీసులు చెబుతున్నారు.అయితే లైసెన్స్ రెన్యువల్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పోలీసు అధికారులు వివరించారు. లైసెన్స్ రెన్యువల్ కోసం నారాయణరెడ్డికి చెందిన ధరఖాస్తు ఏప్రిల్ 11వ, తేదిన జిల్లా ఎస్పీకి చేరిందన్నారు.. ఈ ప్రక్రియ ప్రాసెస్ లో ఉందన్నారు. మరో వైపు పోస్ట్ మార్టం ఆలస్యం కావడానికి పోలీసుల తప్పిదం లేదన్నారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో పిటిషన్ ఇచ్చారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
అధికారపార్టీకి ఇరుకునపెడుతున్న హత్యలు
వరుసగా చోటుచేసుకొంటున్న హత్యలు అధికారపార్టీని ఇరుకునపెడుతున్నాయి.ఈ విషయమై చంద్రబాబు తీరును వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. నారాయణరెడ్డి హత్యకేసులో కేఈ కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు నారాయణరెడ్డి కుటుంబసభ్యులు. అయితే ఈ ఆరోపణలను కేఈ ఖండించారు.సాక్ష్యాధారాలను చెరిపేసేందుకే పోలీసులు సంఘటనస్థలానికి ఆలస్యంగా చేరుకొన్నారని కూడ వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు పోలీసుల తీరును కూడ వైసీపీనేతలు తప్పుబడుతున్నారు.