శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్: 20మంది స్మగ్లర్ల మృతి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చంద్రగిరి మండలం ఈటపాక అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు హతమయ్యారు.మృతి చెందిన వారిలో ఇద్దరు అంతర్జాతీయ గంధపు చెక్కల స్మగ్లర్లు ఉన్నారని సమాచారం.
మృతుల్లో ఎక్కువ మంది కూలీలే అని తెలుస్తోంది. చంద్రగిరి మండలం ఈటపాక తదితర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల పైన రాళ్లు, కత్తులతో దాడికి యత్నించారు. చనిపోయినవారంతా తమిళనాడుకు చెందిన కూలీలు అని తెలుస్తోంది.
మంగాపురంకు కిలోమీటర్ దూరంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పదిమంది పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు రోజుల క్రితం 500 మంది కూలీలను చిత్తూరుకు చెందిన స్మగ్లర్ దింపినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారంతో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు.
రెండు ప్రాంతాల్లో స్మగర్లు మృతి చెందారని టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో ఇరవై మంది మృతి చెందారని చెప్పారు. సోమవారం సాయంత్రం నుండే కూంబింగ్ ప్రారంభించామన్నారు. స్మగర్లు తమ పైన దాడికి యత్నించారని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే తాము కాల్పులు జరిపామన్నారు. కాగా, డీజీపీ జేవీ రాముడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఎన్కౌంటర్ విషయమై వివరించారు.
మూడు రోజులుగా కూలీలను దింపుతున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది తమిళనాడు కూలీలే ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. శ్రీవారి మెట్టు ప్రాంతంలో 9 మంది, శ్రీనివాస మంగాపురంలో 11 మంది కూలీలు మృతి చెందారని చెప్పారు. శేషాచలం అడవుల్లో 3 జిల్లాల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నారు. కాల్పుల్లో పోలీసులు గాయపడ్డారని హోంమంత్రి రాజప్ప చెప్పారు.