మహానాడు భోజనాలు: 250 గ్యాస్ సిలిండర్లు, 50 బస్తాల కందిపప్పు, 40 క్యాన్ల నెయ్యి
అమరావతి: తెలుగుదేశం పార్టీ మూడు రోజుల పండుగ మహానాడు ముగిసింది. తిరుపతిలో అంగరంభవైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల హాజరు, చర్చల నాణ్యత, పసుపు నేతల భాగస్వామ్యం వంటి అంశాలను అందిరినీ ఆకట్టుకున్నాయి.
ఏదైనా పెళ్లి లేదా ఫంక్షన్ సక్సెస్ అయిందని చెప్పాలంటే అక్కడ ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లు ఎంతో కీలకం. మహానాడులో ఏర్పాటు చేసిన భోజనాలు కూడా టీడీపీ శ్రేణులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తంగా చూస్తే భోజనాలపై నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
సుమారు 30 వేల మందికి మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమం ఆతిథ్యమిచ్చింది. ఉదయం అల్పాహారంతో పాటు రెండుసార్లు భోజనాలు పెట్టారు. వారిలో సుమారు 1000 మంది వీఐపీలు ఉన్నారు. అంతేకాదు విడి విడి వంటశాలలు, పసందైన వంటకాలతో భోజనాలను ఏర్పాటు చేశారు.
మొదటి రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, పెరుగు చెట్నీ, టమోటా బాత్, కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి తో టిఫెన్ అందించారు. ఇక మధ్యాహ్నం భోజనంలో సాంప్రదాయవంటకాలు నోరూరింప చేశాయి. మిక్స్ ఫ్రూట్ స్వీట్, చక్ర పొంగలి, రాగి సంకటి, బిర్యానీ, రైతా, ములకాడ జిడ్డి పప్పు, కాబేజీ శనగపప్పు కూరలు సిద్ధం చేశారు.
మామిడి కాయ పప్పు, బెండకాయ కూరలతో విందులో ఏర్పాటు చేశారు. రాత్రి భోజనంలో ఉలవచారు, సాంబార్ తో పాటు కేసరి స్వీట్ను వడ్డించారు. ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని నిరంతరాయంగా చల్లని నీళ్లు, మజ్జిగను అందజేశారు. ఇలా మూడు రోజుల్లో మొత్తం 1.5 లక్షల మందికి భోజనాలను వండి వడ్డించారు.
ఇందుకోసం 250 గ్యాస్ సిలిండర్లు, 13 టన్నుల కట్టెలు వాడారు. మొత్తం 100 క్వింటాళ్ల బియ్యం, 50 బస్తాల కందిపప్పు, 50 బస్తాల మినపప్పు, 300 క్యాన్ల నూనెతో పాటు పలావ్ కోసం 40 క్యాన్ల నెయ్యి వాడారట. ఇక టన్నుల కొద్దీ కూరగాయలు, పదుల కిలోల కొద్దీ పోపు దినుసులు తీసుకొచ్చారు.
ఈ విషయాలను భోజనాల కాంట్రాక్టర్, అంబికాస్ క్యాటరింగ్ యజమాని శివాజీ వెల్లడించారు. ప్రత్యేకంగా 2,500 కిలోల కొత్త ఆవకాయ తయారు చేయించినట్టు ఆయన వివరించారు. 500 కిలోల గోంగూర పచ్చడి తయారు చేయిస్తే, ఒక్క రోజులోనే ఖర్చయిపోయింది. కాగా, తొలిరోజు భోజనం అంతగా సంతృప్తి లేదని చెప్పిన శ్రేణులు ఆ తర్వాత అన్నీ బాగున్నాయని మెచ్చుకున్న సంగత తెలిసిందే.