మావోలకు యువకుడి నిలదీత: చంపేశారు, ప్రతిదాడి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. గత రాత్రి ఇన్ఫార్మర్ అనే నెపంతో సంజీవ రావు అనే యువకుడిని మావోయిస్టులు హత్య చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు అకారణంగా యువకుడిని చంపారంటూ మావోయిస్టులపై రాళ్లతో దాడి చేశారు.
గ్రామస్థుల దాడిలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ డీసీఎం శరత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏకే47 తుపాకీతో పాటు పలు ఆయుధాలు లభించాయి.
కాగా, బాక్సైట్ తవ్వకాల పైన మూడు గ్రామాల ప్రజలతో మావోయిస్టులు గత రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో యువకుడు వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు.. ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. దీంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రతిదాడి చేశారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కన్నకూతుర్ని చూడటానికి బయల్దేరిన ఆ తండ్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులతోపాటు మృతి చెందారు. డోన్ సమీపంలోని అమకతాడు హైవే టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగదీష్(35), అమరనాథ్రెడ్డి(35), రాజేష్(32) దుర్మరణం చెందారు. మృతులంతా చిత్తూరు జిల్లా వాసులు.
బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. చిత్తూరుకు చెందిన జగదీష్ గ్రానైట్ వ్యాపారి. ఏడాది క్రితం హైదరాబాద్కు చెందిన మీనాక్షితో ఆయన పెళ్లయింది. 20రోజుల క్రితం జగదీష్ సతీమణి మీనాక్షి హైదరాబాద్లో ప్రసవించింది.
కూతుర్ని చూడటానికి ఆయన బెంగళూరులో ఆర్కెటెక్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ ప్లానర్గా పనిచేస్తున్న అమరనాథరెడ్డి, అక్కడే హోటల్ క్యాటరింగ్లో పనిచేస్తున్న రాజేష్లతో డస్టర్ వాహనంలో హైదరాబాదుకు బయల్దేరారు. డోన్కు 10కిలోమీటర్ల దూరంలో అమకతాడు హైవే టోల్ప్లాజా వద్ద స్పీడ్బ్రేకర్లు రావడంతో ముందు వెళుతున్న లారీ సడెన్గా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న డస్టర్ వాహనం లారీని ఢీకొట్టడంతో జగదీష్, అమరనాథ రెడ్డి మృతిచెందారు.
టోల్ప్లాజాలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొన ఊపిరితో ఉన్న రాజేష్ను అంబులెన్స్లో డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందారు. సంఘటన స్థలాన్ని డోన్ సీఐ డేగల ప్రభాకర్, క్రిష్ణగిరి ఎస్ఐ నాగేంద్ర పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.