మంత్రులకి బాబు క్లాస్, 30వేల ఎకరాల్లో రాజధాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు మంత్రులను మందలించినట్లుగా తెలుస్తోంది. ఆయా శాఖలకు సంబంధించి పథకాలు అమలు కాకపోవడం పైన బాబు సీరియస్ అయ్యారని సమాచారం. పని తీరు మెరుగుపర్చుకోవాలని మంత్రులకు సూచించారు. పీతల సుజాత, గంటా శ్రీనివాస రావు, కిశోర్ బాబు తీరు పైన బాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
రాజధానిపై కమిటీ
వీజీటీఎం స్థానంలో ఏరియా అభివృద్ధి అధారిటి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు లెక్చరర్ల రెగులరైజేషన్పై కేబినెట్లో చర్చ జరిగింది. నవంబర్ 12 నుంచి 30 వరకు ఉద్యోగుల బదిలీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
వ్యవసాయ భూములను కమర్షియల్ అవసరాలకు వాడడంపై నిషేధం సడలింపులకు కేబినెట్లో చర్చ జరిగింది. రెండు శాతం గ్రీన్ సెస్ వసూలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం తడ నుంచి ఇచ్ఛాపురం వరకు టోల్గేట్ దగ్గర ఎంట్రీ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. అటాగే సంక్షే పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
కేబినెట్ భేటీ విషయాలను మంత్రులు విలేకరుల సమావేశంలో తెలిపారు. రైతుల నుండి భూమి సేకరించి ప్రజా రాజధాని నిర్మిస్తామని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. వీజీటీఎం పరిధిలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రాజధఆనికి 30వేల ఎకరాల భూమి అవసరమని, దీని సేకరణకు ఆరు సెక్టార్లుగా విభజిస్తామన్నారు. 17 గ్రామాల్లో ఈ భూమిని సేకరిస్తామన్నారు. భూమి అభివృద్ధికి ఒక్కో ఎకరాకు రూ.75 లక్షల నుండి కోటి రూపాయలు ఇస్తామన్నారు. రాజధాని కోసం గ్రామాలు, అందులోని ఇళ్ల జోలికి వెళ్లమని తెలిపారు.
భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పిస్తామన్నారు. ప్రభుత్వ భూమి ఉన్న పట్టాదారులకు ఓ విధానం అమలు చేస్తామన్నారు. లాటరీ విధానం ద్వారా రైతులకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో భూమి ఇస్తామని, రైతులకు పదేళ్ల పాటు ప్రతి ఏటా ఎకరానికి రూ.25వేలు ఇస్తామన్నారు. రైతుకు ఏటా ఎకరాకు రూ.1,250 పెంచుతామన్నారు.