కర్నూల్ రక్తచరిత్ర: మూడేళ్ళలో 453 హత్యలు, సినీ ఫక్కిలో...
కర్నూల్ జిల్లాలో 2014 నుండి ఇప్పటివరకు సుమారు 453 హత్యలు జరిగి ఉంటాయని ఓ అంచనా. ఫ్యాక్షన్ గ్రామాల ప్రజలు రోజు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి.
కర్నూల్: కర్నూల్ జిల్లాలో 2014 నుండి ఇప్పటివరకు సుమారు 453 హత్యలు జరిగి ఉంటాయని ఓ అంచనా. ఫ్యాక్షన్ గ్రామాల ప్రజలు రోజు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాక్షన్ హత్యలు పెరుగుతున్నాయి.
ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం హత్యలే పరిష్కారమనే భావన ఫ్యాక్షనిస్టుల్లో నెలకొంది. చావడమో, చంపడమో ఈ రెండు మాత్రమే వారికి తెలుసు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పగలు, ప్రతీకారాలతో హత్యలు సాగుతున్నాయి.
కత్తులు కరాళ నృత్యం చేస్తున్నాయి. ప్రత్యర్థులు శత్రువుల గుండెల్లో మారణాయుదాలు దింపుతున్నారు. తమ వారిని ఎంత దారుణంగా హతమార్చారో శత్రువును అంతకంటే దారుణంగా హత్యచేస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్ గ్రామాలు మరోసారి భగ్గుమంటున్నాయి.జిల్లాలో సుమారు నాలుగువందలకు పైగా ఫ్యాక్షనిస్టులున్నారు. వీరు ఏదో ఒక పార్టీ అండన ఉన్నారు. పార్టీలు కూడ తమ ఉనికి కోసం ఫ్యాక్షనిస్టులకు అండగా నిలుస్తున్నారు.
మూడేళ్ళలో 453 మంది హత్యలు
2014 నుండి 2017 వరకు కర్నూల్ జిల్లాలో 453 మంది హత్యకు గురయ్యారు.కర్నూల్ జిల్లాలోని 74 గ్రామాలను ఫ్యాక్షన్ గ్రామాలుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్రామాల్లో సుమారు 400మందికిపైగా ఫ్యాక్షనిస్టులున్నారు.అయితే హత్యలను నివారించేందుకు పోలీసు యంత్రాంగం సుమారు 255 మంది మాత్రమే. ముందు జాగ్రత్త కోసం ఏర్పాటుచేసిన నిఘా సిబ్బంది కేవలం 50 మంది మాత్రమే. అయితే పోలీసు సిబ్బంది మాత్రం సరిపోవడం లేదు. రాజకీయ ఆధిపత్యమో, ఇతరత్రా కారణాలు కావచ్చు ఈ జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు సాగుతూనే ఉన్నాయి.
సినీ ఫక్కిలో హత్యలు
2008లో టిడిపి నాయకుడు కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు హత్య నాటినుండి కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొన్న హత్యలు సినీ ఫక్కిని తలపిస్తున్నాయి. లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలతో వెంబడించి ఢీకొట్టి ఆ తర్వాత తమ హత్యలకు పూనుకొంటున్నారు. కప్పట్రాళ్ళ వెంకటప్పనాయుడు ప్రయాణస్తున్న వాహనాన్ని లారీతో ఢీకొట్టారు.అయితే తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినా...చివరకు ప్రత్యర్థులు ప్లాన్ ప్రకారంగా కప్పట్రాళ్ళను హత్య చేశారని నిర్ధారించారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యలో కూడ ప్రత్యర్థులు ట్రాక్టర్లతో ఢీకొట్టి ఆయనను హత్యచేశారు.
సమయం కోసం ఎదురుచూడకుండా ప్రత్యర్థి దొరికితే చాలు
కర్నూల్ జిల్లాలో ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి సమయం చూసుకోవడం లేదు. శత్రువుల ప్రతి కదలికపై నిఘాను ఏర్పాటుచేసుకొని అదను దొరకగానే దాడులకు పూనుకొంటున్నారు. అనుకొన్న సమయం దొరికితే శత్రువుకు అవకాశం ఇవ్వకుండా వేటకొడవళ్ళతో తెగనరుకుతున్నారు.తమ లక్ష్యసాధనకోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన హత్యల్లో కొన్ని
ఈ నెల 6, ఆళ్ళగడ్డ నియోజకవర్గపరిధిలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో మాజీ ఎంపిపి ప్రభాకర్ రెడ్డి, ఆయన బావమరింది శ్రీనివాసులు రెడ్డి హత్యకు గురయ్యారు. గత ఏడాది 6వ, తేదిన కర్నూల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు కుర్వరాముడు హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు సుమోతో ఢీకొట్టి చంపారు.గత ఏడాది జనవరి 5న, బనగానపల్లె మండలం రామకృష్ణాపురానికి చెందిన టిడిపి నాయకుడు నగేష్ ప్రత్యర్థుల చేతిలో మృతిచెందారు.ఈ ఏడాది జనవరి 24న, రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ను నరికిచంపారు.