రక్తసిక్తమైన రోడ్లు: 13 మంది మృతి, 60 మందికి గాయాలు
విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం నూతనగుంటపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి 52 మంది యాత్రికులు రాజమండ్రి పుష్కరాలకు బయలుదేరారు. అలానే, విజయనగరం ఎస్కోట మామిడిపల్లి గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో రాజమండ్రి గోదావరి పుష్కరాలకు వెళ్తున్నారు.
నూతనగుంటపాలెం వద్దకు రాగానే ముందు వెళ్తున్న ప్రైవేటు బస్సును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని యలమంచలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది.
లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి
ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో ఢీకొనడం వల్ల ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆటోలో పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా గుంటూరు శివర్లాలోని అంకిరెడ్డిపాలెం దగ్గర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శిలకు చెందిన సత్యనారాయణ, సురేష్, కొండయ్యలని పోలీసులు గుర్తించారు.
రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెనపై పుష్కర భక్తుల వ్యాన్ బోల్తా
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు- రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెనపై సోమవారం ఉదయం పుష్కరభక్తుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. బోగోలు మండలం కడనూతల దగ్గర జాతీయరహదారిపై ఓ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గోదావరి పుష్కరాలకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. మృతులను గూడూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి
విశాఖ జిల్లా మధురవాడ సమీపంలో 16వ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి ఆనందపురం వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొని సుమారు 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తు్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉండటంతో విశాఖలోని కేజీహెచ్కు తరలించారు.