పాదయాత్రతో హైటెన్షన్: అనుమతి లేదన్నా పట్టు వీడని ముద్రగడ
ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరిస్తోంది.
కాకినాడ: కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి (బుధవారం) నుంచి నిర్వహించే పాదయాత్ర నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నెల 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు జేఏసీ పాదయాత్ర నిర్వహణకు పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి.
అయితే కాపు సత్యాగ్రహ యాత్ర పేరిట జరుగుతున్న ఈ యాత్రకు అనుమతిలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. అనుమతి లేకపోతే పాదయాత్రను జరగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ అరుణ్కుమార్ తెలిపారు.
ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రసంగాలు, ధర్నాలు ప్రత్యక్ష ప్రచారాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ ప్రకటించారు. అంతేకాకుండా బల్క్ ఎస్ఎంఎ్సలు, సెల్ఫోన్ ఇంటర్నెట్ సేవలను కూడా ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు.
భారీగా భద్రతా సిబ్బంది మోహరింపు.
ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో 5,800 పోలీసులు సిబ్బందిని మోహరించారు. సాయుధ రిజర్వ్ బలగాలు, ఎపిఎస్పీ బెటాలియన్ అధికారులు, సివిల్ పోలీసులు, ఏడు నక్సల్స్ నిరోధ బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలు తూర్పు గోదావరి జిల్లాలో మోహరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రప్పించారు. నీళ్లు, క్రేన్లు, ఫ్రంట్ గార్డ్స్, ఇతర రక్షణ సామాగ్రి గల వాహనాలను సిద్ధం చేశారు. గుంపులను చెదరగొట్టడానికి వీటిని వాడుతున్నారు.
ముద్రగను గృహ నిర్బంధం చేస్తారా...
కాగా, ముద్రగడను గృహ నిర్బంధం చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో 3 వేల మంది సిబ్బందిని నియోగించారు. తాను మంగళవారం సాయంత్రం కిర్లంపూడి నుంచి బయలుదేరి రావులపాలెం చేరుకుంటానని, అక్కడి నుంచి 25వ తేదీ ఉదయం పాదయాత్రను ప్రారంభిస్తానని ముద్రగడ చెబుున్నారు.
నిజానికి అప్పుడే అనుకున్నారు...
ముద్రగడను ఆదివారంనాడు కాకినాడ వచ్చిప్పుడే గృహ నిర్బంధం చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, చివరి నిమిషంలో తమ వ్యూహాన్ని ఉపసంహరించుకున్నారు. కిర్లంపూడిలోని తన నివాసం వద్ద పోలీసులు, ఇతర వ్యక్తుల సంచారాన్ని తెలుసుకోవడానికి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన నివాసం వద్ద సిసి కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్తో మూవింగ్ కెమెరాలు ఉన్నాయి.
ఎస్పీ ఇలా.. ముద్రగడ అలా...
అనుమతి కోసం ముద్రగడ పద్మనాభం దరఖాస్తు చేసుకోలేదని, అందువల్ల ఆయన పాదయాత్రను అనుమతించే ప్రసక్తి లేదని ఎస్పీ ఎం. రవి ప్రకాష్ చెప్పారు. అయితే, ఆందోళనకు తాను అనుమతి కోరబోననిముద్రగడ చెప్పారు. శాంతిభద్రత పర్యవేక్షణ కోసం అదనపు ఎస్పీ ఎఆర్ దామోదర్ కిర్లంపూడిలోనే మకాం వేశారు.