8 ఏళ్ల బాలుడు కిడ్నాప్, హత్య: విషాదంలో కుటుంబం
విశాఖ: అనకాపల్లి మండలం గౌరపాలెంలో ఉదయ్ (8) అనే బాలుడి కిడ్నాప్ అంశం విషాదాంతమైంది. బాలుడి మృతదేహం కొప్పాక దగ్గర ఏలేరు కాలువలో వెలుగు చూసింది. 24 గంటల క్రితం గౌరపాలెంకు చెందిన ఉదయ్ పాఠశాలకు వెళ్లి రాలేదు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఏలేరు కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహం ఉదయ్ది అని గుర్తించారు.
శుక్రవారం రాత్రి ఉదయ్ని కిడ్నాప్ చేసిన దుండగులు రూ.ఒక లక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఫోన్ కాల్ సిమ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. శనివారం గౌరుపాలెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు.
అయితే, ఇది కేవలం ఆకతాయిగా, డబ్బు కోసం చేశామని, తమ వద్ద బాలుడు లేడని.. శేఖర్ అనే వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బాలుడు శవమై కనిపించాడు. పోలీసులు శేఖర్ కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితులను ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.