మూడేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. కోటిన్నర డిమాండ్
నెల్లూరు: జిల్లాలోని సైదాపురంకు చెందిన మోహిత్ అనే మూడేళ్ల బాలుడ్ని మంగళవారం దుండగులు కిడ్నాప్ చేశారు. మోహిత్ను విడిచిపెట్టాలంటే రూ. కోటిన్నర చెల్లించాలని కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే.. సైదాపురం మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా లక్ష్మీ విద్యానికేతన్ స్కూల్ను మహేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య యామిని, కుమారులు మోహిత్(3), నిఖిల్(9నెలలు) ఉన్నారు. వీరికి నెలరోజుల క్రితం గ్రామానికి వచ్చిన దినేష్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మహేందర్రెడ్డి ఇంటికొచ్చిన దినేష్.. మీ అబ్బాయిని కిడ్నాప్ చేస్తే ఎంతిస్తావు.. అని మహేందర్ రెడ్డిని ప్రశ్నించాడు.
ఏదో సరదాగా జోక్ చేస్తున్నాడులే అనుకుని ఎంతోకొంత ఇస్తాలే అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి కొందరు దుండగులు మహేందర్రెడ్డికి ఫోన్చేసి మీ అబ్బాయి మోహిత్ను కిడ్నాప్ చేశామని, రూ.1.50కోట్లు ఇస్తే వదిలేస్తామని, లేదంటే చంపేస్తామంటూ ఫోన్ చేసి బెదిరించారు. దీంతో కిడ్నాప్ విషయాన్ని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేష్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రైల్లో నుంచి జారిపడి విద్యార్థి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్లో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ రైలులో నుంచి జారిపడి ఓ పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు.
వివరాల్లోకి వెళితే.. బారంగి మండల కేంద్రానికి చెందిన మరడాన కిషోర్(18) విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గ్రామదేవత పండగ కోసం రైలెక్కిన కిషోర్ మంగళవారం ఉదయం బొబ్బిలి స్టేషన్లో దిగేటప్పుడు ఈ దుర్ఘటన జరిగింది.